NTV Telugu Site icon

Congress : అన్నా చెల్లి మధ్యలో లొల్లి.. ఆ పార్టీలో వారిగురించే చర్చ నడుస్తోందా..?

Khairthabad Congress

Khairthabad Congress

తెలంగాణ కాంగ్రెస్‌లో ఒకప్పుడు పీజేఆర్‌ బలమైన నాయకుడు. ఆయనకంటూ సొంత ఇమేజ్‌ ఉండేది. పార్టీలో హైదరాబాద్‌ ప్రస్తావన వస్తే.. పీజేఆర్‌ పేరు చర్చకు వచ్చేది. పీజేఆర్‌ మరణం తర్వాత ఆ ఇమేజ్‌ను సొంతం చేసుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన తనయుడు విష్ణువర్దన్‌రెడ్డి. ఎమ్మెల్యేగానూ చేశారు. గత రెండు ఎన్నికల్లో నెగ్గుకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి వైసీపీలో పొలిటికల్‌ ఎంట్రీ ఇచ్చి.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరి రెండుసార్లు GHMC కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే అధికారపార్టీలో తనకు తగిన గుర్తింపు.. గౌరవం లేదని భావించిన ఆమె.. ఇటీవలే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పేసుకున్నారు. ఆ విధంగా అన్నా చెల్లెళ్లు ఇద్దరూ కాంగ్రెస్‌లోనే ఉన్నట్టు అయ్యింది. కానీ.. విజయారెడ్డి చేరికపై విష్ణువర్థన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో సమస్య రాజుకుంది.

విజయారెడ్డి చేరిక సమయంలోనే కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. పీజేఆర్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి ఆమె రాకను స్వాగతించారనే చర్చ నడిచింది. కానీ.. ఆ తర్వాతే పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత రెండు ఎన్నికల్లో ఓడిన విష్ణు..కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా లేరు. దీనిపై కేడర్‌ కూడా అసంతృప్తితో ఉందట. విజయారెడ్డి రాకతో అన్నకు చెల్లి నుంచే పోటీ అని ప్రచారం మొదలైంది. దీంతో విష్ణు పావులు కదపడం మొదలు పెట్టారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యి చర్చించారు. ఇక్కడే ఇంకో గమ్మత్తు ఉంది. విజయారెడ్డిని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ల చేర్చుకుంటే.. విష్ణు వెళ్లి ఆ అంశంపై సీఎల్పీ నేత భట్టితో మాట్లాడారు. దీంతో కొత్త వాళ్లు రేవంత్‌తో.. పాత వాళ్లు పాత నాయకులతో భేటీ అవుతున్నారనే చర్చ జరుగుతోంది.

తాజాగా విష్ణువర్ధన్‌రెడ్డి కాంగ్రెస్‌ నేతలను భోజనానికి పిలిచారు. అది కూడా చర్చగా మారింది. భోజనానికి రావాలని రేవంత్‌ టీమ్‌కు కూడా విష్ణు ఆహ్వానం పంపారట. అయితే ఆ విందు సమావేశం రచ్చ రచ్చగా మారపోయింది. ప్రస్తుతం అన్నా చెల్లి మధ్య రేగిన ఈ సమస్యను పార్టీ ఏ విధంగా పరిష్కరిస్తుంది అనేది ఆసక్తిగా మారింది. జూబ్లీహిల్స్‌.. ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో ఇప్పటికీ పీజేఆర్‌ అంటే స్థానికులకు అభిమానం ఉంది. ఆ అంశాన్ని దృష్టిలో పెటుకుని సమస్యను కొలిక్కి తేవాలన్నది పార్టీ వర్గాల మాట. పార్టీలో సీనియర్ నాయకులు సైతం విష్ణుతో భేటీ అవుతున్నారు. మరి.. అన్నా చెల్లి మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో చూడాలి.

 

అన్నా చెల్లి మధ్యలో లొల్లి.. ఆ పార్టీలో వారిగురించే చర్చ నడుస్తోందా..? | Off The Record | NTV