పోటీ చేయడానికి అభ్యర్థిని నిలబెట్టడం వరకు ఓకే..! కానీ.. ఓట్లేయించుకోవడం ఎలా? బద్వేల్లో బీజేపీ ముందు ఉన్న అతిపెద్ద సవాల్ ఇదేనట..! తాపీగా కూర్చుని డిపాజిట్ లెక్కలు వేసుకుంటున్నారట నాయకులు. ఎలాగో ఏంటో.. ఈ స్టోరీలో చూద్దాం.
2019లో బీజేపీకి వచ్చింది 735 ఓట్లే..!
డిపాజిట్ దక్కేంత ఓట్లు వస్తాయా.. లేదా?
బద్వేలు ఉపఎన్నికలో ప్రతిపక్షపాత్ర పోషించేందుకు బీజేపీకి అరుదైన అవకాశం దక్కింది. చనిపోయిన సిట్టింగ్ మెంబర్ కుటుంబానికే టిక్కెట్ కేటాయించడంతో టీడీపీ, జనసేనలు బరిలో నుంచి తప్పుకొన్నాయి. దీంతో అధికారపార్టీకి ఎదురుగా బీజేపీనే పోటీకి ఉంది. ఈ పరిస్థితుల్లో బద్వేలులో బీజేపీ పోటీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గడచిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి 735 ఓట్లు వచ్చాయి. డిపాజిట్ రాలేదు. ఈసారైనా డిపాజిట్ దక్కుతుందా.. లేదా..? అని కడప జిల్లాలోని బీజేపీ నేతలే చర్చించుకునే పరిస్థితి ఉంది. బద్వేలులో సుమారు 2 లక్షల 14 వేల మంది ఓటర్లు ఉన్నట్టు సమాచారం. 2019లో లక్షా 50 వేల మంది ఓటేశారు. ఇప్పుడు ఇంకా పెరిగే వీలుంది. డిపాజిట్ దక్కాలంటే పోలైన ఓట్లలో ఆరోవంతు బీజేపీకి రావాల్సి ఉంటుంది. ఆ లెక్క ప్రకారం చూస్తే.. బీజేపీ అభ్యర్థి సురేష్కు కనీసం 25 వేలకుపైగా ఓట్లు పోల్ కావాలి. అది జరిగే పనేనా అని విశ్లేషించుకుంటున్నాయట కాషాయ శ్రేణులు.
అప్పట్లో జనసేన మద్దతిచ్చిన బీఎస్పీకి 1,321 ఓట్లు..!
జనసేన పోటీ చేయకున్నా.. మిత్రపక్షం బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. బద్వేలు పరిధిలో బలిజ సామాజికవర్గం ఓట్లు గణనీయంగానే ఉన్నాయి. జనసేన మద్దతువల్ల బలిజ సామాజికవర్గం నుంచి కాస్తో కూస్తో ఓట్లు వస్తాయని లెక్కలేస్తున్నారట. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదన్నది ఒక ప్రశ్న. గత ఎన్నికల్లో లెఫ్ట్, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్న జనసేన.. బద్వేల్ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించింది. అప్పుడు బీఎస్పీ అభ్యర్థికి కేవలం1321 ఓట్లే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో పోటీ చేయని జనసేన బీజేపీకి మద్దతిచ్చినా భారీగా ఓట్లు వస్తాయా? అనేది ఒక అనుమానం.
బద్వేల్ టీడీపీ కేడర్ను దువ్వే ప్రయత్నంలో బీజేపీ నేతలు..!
టీడీపీ పోటీలో లేకపోవడంతో.. వైసీపీ సర్కార్ వ్యతిరేక ఓటర్లంతా తమకే వేస్తారనేది బీజేపీ మరో అంచనా. ఏ మొగుడూ లేకుంటే అక్క మొగుడే దిక్కు అనే రీతిలో టీడీపీ ఓటర్లు బీజేపీవైపే మొగ్గు చూపుతున్నారని లెక్కలేస్తున్నారట మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. బద్వేలు పరిధిలో ఉన్న గోపవరం మండలం ఎంపీపీ, జడ్పీటీసీలను కైవశం చేసుకుంది టీడీపీ. ఈ క్రమంలో టీడీపీ బరిలో ఉంటే పోటీ కాస్త టైట్గా ఉండొచ్చనే భావించారు. ఇప్పుడు ఆ మండలానికి చెందిన ఓటర్లు.. టీడీపీ సానుభూతిపరులు బీజేపీకి ఓటేస్తారన్నది కమలనాథుల లెక్క. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడే పనిలో బీజేపీ కడప జిల్లా ముఖ్యులు బిజీగా ఉన్నారట. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం రమేష్ వంటి వారికి కడప జిల్లా టీడీపీ నేతలతోనూ.. బద్వేలు నియోజకవర్గ, మండలస్థాయి నాయకులతో సత్సంబంధాలు ఉండటంతో ఆ పార్టీ కేడర్ను దువ్వే ప్రయత్నం చేస్తున్నారట.
బీజేపీకి డిపాజిట్ దక్కితే అతిపెద్ద వండర్?
బీజేపీ కాగితాలపై వేస్తున్న లెక్కలు భారీగా ఉన్నా.. క్షేత్రస్థాయిలో అవి ఎంతవరకు వర్కవుట్ అవుతాయన్నది ప్రశ్న. టీడీపీ పోటీలో లేకున్నా.. జనసేన మద్దతిచ్చినా.. డిపాజిట్ వస్తుందా.. రాదా అన్న డౌట్ అలాగే ఉందట. అందుకే ఈదఫా బీజేపీకి డిపాజిట్ దక్కితే అతిపెద్ద వండరే అవుతుందని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. మరి.. బద్వేలులో కమలం జాతకం ఎలా ఉందో చూడాలి.
