Off The Record: ఆ ప్రముఖ పుణ్య క్షేత్రంలో అరాచకాలు, అడ్డగోలుతనం అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చే ఛాన్స్ లేకుండా… రాజకీయ నాయకులే ఆ పని చేసేస్తున్నారు. యుగాల ప్రాశస్త్యం ఉన్న క్షేత్రంలో చివరికి కిరాణా షాపుల్లో మద్యం అమ్ముతున్నారు. దాని వెనక టీడీపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? వేళ్ళన్నీ ఎటువైపు చూపిస్తున్నాయి?
నంద్యాల జిల్లా అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాశస్త్యం, పవిత్రత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పుణ్య క్షేత్రంలో ఇప్పుడు పొలిటికల్ కంపు కొడుతోంది. దాన్ని మామూలుగా కంపు అనేకంటే… గబ్బులేచిపోతోందని అనడం చాలా కరెక్ట్ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్వామివారి భక్తులు. అడ్డగోలు వసూళ్ళ నుంచి కిరాణా షాపుల్లో మద్యం అమ్మకాల దాకా… అంతా విచ్చలవిడి అయిపోయిందని, వసూళ్ళలో కొంత భాగం ఆళ్ళగడ్డ నియోజకవర్గంలోని ముఖ్య నేతలు కొందరికి అందుతోందన్న ప్రచారం ఇంకా కలకలం రేపుతోంది. ఈ నారసింహ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దట్టమైన నల్లమల ఆటవీప్రాంతంలో ఉంది. భక్తి పారవశ్యంతో పాటు ప్రకృతి ఆస్వాదన కూడా ఇక్కడి ప్రత్యేకం.
Read Also: Tata Motors 2026 Cars: కొత్త సంవత్సరంలో టాటా మోటార్స్ లాంచ్ చేసే కార్లు ఇవే!
అదంతా ఒక వైపు అయితే.. మరోవైపు మాత్రం నారసింహుడి దర్శనానికి వచ్చే భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో అడుగుపెట్టడంతోనే బాదుడు మొదలవుతుంది. టోల్ గేటు ఫీజు, టెంకాయ ధరలు, తలనీలాలు, పార్కింగ్.. ఇలా ఒకటేంటి.. ఎటు చూసినా.. వాయింపుడేనని ఆవేదనగా చెబుతున్నారు భక్తులు. ఈ దోపిడీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోందని, దీని వెనుక కొందరు తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏంటీ అడ్డగోలు వసూళ్లు, ధరలు అని అడిగితే… ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు మామూళ్ళు ఇచ్చుకోవాలి, వాళ్ళకు ఇవ్వాల్సింది పోగా మేం కూడా బతకాలంటే…ఆ మాత్రం రేట్లు ఉండాలి కదా అని అంటున్నారట. అహోబిలం వెళ్లిన భక్తులు మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేని రేట్లు ఇక్కడే ఉన్నాయంటూ ముక్కున వేలేసుకుంటున్నారట. ఇక్కడికి కారు ఎంటర్ కావాలంటే.. 150 రూపాయల టోల్ ఫీజు కట్టాల్సిందే. కారులో వెళ్ళేవాడికి 150 ఎక్కువా అంటూ రివర్స్ ఆలోచించవద్దు. మిగతా చోట్లతో పోలిస్తే ఇది ఎక్కువేనంటున్నారు భక్తులు.
శ్రీశైలంలో కారుకు టోల్ ఫీజు 100 రూపాయలు. మహానందిలో 80, మంత్రాలయంలో 50 రూపాయలు మాత్రమే. ఇతర పుణ్య క్షేత్రాల్లో పెద్ద బస్సులకు వసూలు చేస్తున్న టోల్ ఫీజు కంటే అహోబిలం లో కార్లకే ఎక్కువన్నది ఇక్కడి వాళ్ళ మాట. ఎందుకలా అంటే.. ఆళ్ళగడ్డ ట్యాక్స్ అన్నది ఆన్సర్. ఇక టెంకాయ ధర అదిరిపోతుందట అహోబిలంలో. శ్రీశైలంలో టెంకాయ ధర 25 రూపాయలు. మహానందిలో 40, మంత్రాలయంలో రెండు టెంకాయలు, కలకండ, అగర్బత్తి అన్నీ కలిపి వందకు అమ్ముతున్నారు. కానీ… అహోబిలంలో మాత్రం ఒక్క టెంకాయే 50 రూపాయలు. ఇక ఇక్కడ భక్తితో స్వామి వారికి సమర్పిస్తే తలనీలాల విషయంలోనూ గోల్మాల్ జరుగుతోందట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇంతకు మించిన అరాచకం ఇంకోటి జరుగుతోంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలోని కిరాణా షాపుల్లో మద్యం అమ్ముతున్నారట.
Read Also: Bangladesh: బంగ్లా జాతీయ కవి పక్కనే రాడికల్ హాది అంత్యక్రియలు.. ఎందుకు ఇలా చేశారు?
సాధారణంగా బెల్ట్ షాపులు చూసి ఉంటారుగానీ.. ఇక్కడ మాత్రం కిరాణా మద్యం స్పెషల్ అంటూ సెటైర్స్ వేస్తున్నారు స్థానికులు. ఇదంతా చూస్తూ.. వింటూ భక్తులు మాత్రం హే.. నారసింహా.. ఎక్కడున్నావయ్యా.. జరుగుతున్న పాపాల్ని చూస్తున్నావా? ఈ దరిద్రుల్ని శిక్షించలేవా అంటూ వేడుకుంటున్నారు. అసలు అహోబిలంలో ఏ టెండర్ దక్కాలన్నా.. కొన్ని అదృశ్య శక్తుల ఆశీస్సులు ఉండాలట. ఆ చేతులు సైగలు చేయనిదే ఇక్కడ పిట్ట పురుగు కదలడానికి వీల్లేదని చెప్పుకుంటున్నారు. ఈ అరాచకాల వెనక లోకల్ టీడీపీ నాయకులు ఉన్నారని, వాళ్ళ వెనక కొన్ని పెద్ద తలకాయలు ఉన్నాయన్నది అహోబిలం టాక్. స్వామికి నిలువు దోపిడీ ఇవ్వాలనుకునే వాళ్లకు ఆ ఛాన్స్ లేకుండా వీళ్ళే ఆ పని చేస్తున్నారన్న సెటైర్స్ సైతం వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారాల్ని ఇలాగే వదిలేస్తే… రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వచ్చే చోట రచ్చ పెరిగి తెలుగుదేశం పార్టీ మీద వోవరాల్గా ఎఫెక్ట్ పడుతుందన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. పార్టీ, ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి ఆ అదృశ్య హస్తాలను పెడ రెక్కలు విరిచి కట్టకుంటే… ఇమేజ్ బీభత్సంగా డ్యామేజ్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు అహోబిలంలో.
