నీళ్లు లేకుండా ఒక రోజు గడపడం కూడా ఎంత కష్టమో అందరికీ తెలుసు. కానీ ఒక నగరం మొత్తం నీటి కోసం ఎదురుచూసే రోజులు వస్తే? ట్యాంకర్ కోసం రాత్రి నుంచే క్యూల్లో నిలబడాల్సి వస్తే? బోర్వెల్ మోటార్ ఆన్ చేసినా చుక్క నీరు కూడా రాకపోతే? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఊహలు కావు. ఇండియాలోని అనేక నగరాల్లో నెమ్మదిగా మారుతున్న నిజాలు. ఒకప్పుడు సరస్సుల నగరంగా పేరున్న హైదరాబాద్ కూడా ఇప్పుడు నీటి ఆందోళనల దారిలో నడుస్తోంది.
నగరం విస్తరిస్తున్న కొద్దీ భూమి కింద ఉన్న నీటి నిల్వలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు వర్షాలతో నిండిపోయే చెరువులు.. కాంక్రీట్ అడవుల మధ్య కనుమరుగైపోతున్నాయి. కొత్త కాలనీలు, ఎత్తైన అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి కానీ వాటికి సరిపడే నీటి వనరులు మాత్రం అంతే వేగంగా పెరగడం లేదు. ఇది హైదరాబాద్కే పరిమితం కాదు. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద నగరాలు ఇప్పటికే తీవ్రమైన నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత నీటి ఒత్తిడిని ఎదుర్కొంటున్న 20 నగరాల్లో ఇండియాకు చెందిన ఐదు నగరాలు ఉన్నాయి. అందులో హైదరాబాద్ కూడా ఒకటి.
ఇంతకీ భారత నగరాలు ఎందుకు ఇలా నీటి సంక్షోభం వైపు సాగుతున్నాయి? హైదరాబాద్లో పరిస్థితి ఎంత తీవ్రమవుతోంది? ఈ సమస్యకు పరిష్కారం ఉందా?
భారత నగరాల్లో నీటి సమస్య ఒక్కసారిగా ఏర్పడినది కాదు. ఇది దశాబ్దాలుగా పెరుగుతూ వచ్చిన సంక్షోభం. జనాభా వేగంగా పెరగడం, నగరాలు విస్తరించడం, ప్రకృతి వనరులపై ఒత్తిడి పెరగడం లాంటి అంశాలు ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి.
ఒకప్పుడు చెరువులు, కుంటలు, కాలువలు నగరాలకు సహజ జలాశయాలుగా ఉండేవి. కానీ నగరాల విస్తరణలో వాటిలో చాలా భాగం మాయమయ్యాయి. వాటి స్థానంలో రోడ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు వచ్చాయి. దీంతో భూమిలోకి చేరాల్సిన వర్షపు నీరు నేలలోకి చొచ్చుకుపోయే మార్గం కోల్పోయింది. ఇటు హైదరాబాద్లో పరిస్థితి కూడా ఇలాగే మారుతోంది. నగరం వేగంగా విస్తరించిన ప్రాంతాల్లో వేలాది బోర్వెల్స్ను తవ్వారు. కొత్త కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు ఎక్కువగా భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో బోర్వెల్లు వందల అడుగుల లోతులోకి వెళ్లినా నీరు దొరకడం కష్టమవుతోంది. దీంతో చాలా కాలనీలు ఇప్పుడు పూర్తిగా ట్యాంకర్ నీటిపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్కు ప్రధానంగా నీరు సరఫరా చేసే వనరులు కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు. కానీ నగరం పెరుగుతున్న వేగంతో పోలిస్తే ఈ సరఫరా కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. వేసవి కాలంలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో నీటి పంపిణీ వ్యవస్థపై భారీ ఒత్తిడి పడుతోంది. ఇదే సమయంలో నగరంలోని అనేక చిన్న చెరువులు, కుంటలు కనుమరుగవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇది హైదరాబాద్కే పరిమితం కాదు. చెన్నై ఇప్పటికే 2019లో తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంది. 2024లో బెంగళూరు తీవ్రమైన నీటి కొరతను చూసింది. ఢిల్లీ ప్రతి వేసవిలో యమునా నీటిపై పొరుగు రాష్ట్రాలతో వివాదాలను ఎదుర్కొంటోంది. ఈ ఘటనలు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. నగరాల నీటి సంక్షోభం భవిష్యత్తు సమస్య కాదు. అది ఇప్పటికే ప్రారంభమైపోయింది.
నీటి నిర్వహణలో మార్పులు తీసుకురాకపోతే తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు తమ ఆదాయంలో పెద్ద భాగాన్ని కేవలం నీటిని కొనుగోలు చేయడానికే ఖర్చు చేయాల్సి వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ట్యాంకర్ నీటికి అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పాత పైప్లైన్లలో లీకేజీలను తగ్గించడం, అక్రమ నీటి వినియోగాన్ని నియంత్రించడం, బోర్వెల్ తవ్వకాలను నియంత్రించడం, పెద్ద వినియోగదారులకు అధిక ఛార్జీలు విధించడం లాంటి చర్యలు ఒక్కొక్కటిగా కొంతమేర సహాయపడతాయి. కానీ ఇవన్నీ కలిపి అమలు చేసినప్పుడే పెద్ద మార్పు కనిపిస్తుంది.
వర్షపు నీటి సంరక్షణ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. నగరాల్లో ప్రతి భవనంలో రైన్వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు సక్రమంగా అమలు చేస్తే భూగర్భ జలాలను మళ్లీ నింపే అవకాశం ఉంటుంది. అలాగే శుద్ధి చేసిన మురుగు నీటిని పరిశ్రమల కోసం ఉపయోగించడం లాంటి చర్యలు కూడా తాగునీటి మీద ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇక ఇండియాలో ఇప్పటికైతే పూర్తిగా నీరు లేని పరిస్థితైతే లేదు. కానీ నగరాలు ఈ సమస్యను ఇప్పుడే సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్తు మరింత కఠినంగా మారే ప్రమాదం ఉంది.
వేగంగా పెరుగుతున్న నగరాలు, తగ్గుతున్న నీటి వనరులు అనే ఈ రెండు వాస్తవాల మధ్య సమతుల్యత సాధించకపోతే, రానున్న సంవత్సరాల్లో నీటి కోసం నగరాలు పోరాడే రోజులు కూడా దూరంలో ఉండకపోవచ్చు.