మనకు కనిపించదు. వాసన కూడా ఉండదు. కానీ అది ప్రతి ఊపిరితో శరీరంలోకి వెళ్తోంది. హైదరాబాద్ గాలి ఇప్పుడు మనుషులను సైలెంట్గా చంపుతున్న ఆయుధంగా మారుతోంది. ఇది పొగమంచు కాదు.. ఇది మామూలు కాలుష్యం కూడా కాదు. ఇది నెమ్మదిగా పనిచేసే విషం. అదే సల్ఫర్ డయాక్సైడ్.. దాన్నే SO2 అని పిలుస్తారు.
ఓవైపు రోడ్లపై ట్రాఫిక్ కదులుతోంది.. మరోవైపు భవనాలు ఎదుగుతున్నాయి. ఇలా నగరం అభివృద్ధి చెందుతున్నట్టే కనిపిస్తోంది. కానీ ఆ అభివృద్ధి వెనక ఒక చీకటి నిజం దాగి ఉంది.
మనం పీల్చుకునే గాలిలో విషపూరిత వాయువు ప్రమాదకర స్థాయికి చేరిందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలు ఈ భయంకర దాడికి కేంద్రాలుగా మారుతున్నాయి. వాహనాల పొగ, పరిశ్రమల ఉద్గారాలు కలసి ఇప్పుడు మన ఊపిరిని లక్ష్యంగా చేసుకున్నాయి. దీని ప్రభావం వెంటనే కనిపించదు కానీ ఇకపై శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. ఆస్థమా, శ్వాసకోశ వ్యాధులు మెల్లగా మన జీవితంలోకి ప్రవేశిస్తాయి.
హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీపై IIT కాన్పూర్ అధ్యయనం చేసింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఈ స్టడీ జరిగింది. ఇందులో నగరంలోని గాలి కాలుష్య మూలాలు, వాటి తీవ్రతను శాస్త్రీయంగా విశ్లేషించారు.
ఆ అధ్యయనంలో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో రోజుకు సగటున 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాలిలోకి విడుదలవుతోంది. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 10,701 కిలోల SO2 ఉద్గారాలు నమోదయ్యాయి. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. GHMC పరిధిలో విడుదలవుతున్న SO2లో 91 శాతం వాహనాల నుంచే వస్తోంది. కానీ ORR ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ 92 శాతం SO2 పరిశ్రమల నుంచే వస్తోంది.
అంటే నగర కేంద్రంలో మనం నడిపే వాహనాలే గాలిని విషపూరితం చేస్తుంటే.. నగర అవతల పరిశ్రమలు ఊపిరిని మింగేస్తున్నాయి.
సల్ఫర్ డయాక్సైడ్ ఒక సాధారణ కాలుష్య వాయువు కాదు. ఇది ఫాసిల్ ఇంధనాల దహనంతో ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా డీజిల్, బొగ్గు వాడకం ఎక్కువైన చోట్ల దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం, SO2 గాలి ద్వారా శరీరంలోకి వెళ్లినప్పుడు శ్వాసనాళాల్లో మంట, ఊపిరితిత్తుల వాపు, ఆస్థమా తీవ్రత పెరగడం లాంటి సమస్యలు వస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఇది కేవలం ఆరోగ్య సమస్యగా మాత్రమే మిగలదు.
SO2 వర్షంతో కలిసినప్పుడు ఆమ్ల వర్షంగా మారుతుంది. దీని వల్ల నేల సారం తగ్గుతుంది. పంటలు దెబ్బతింటాయి. చెట్లు ఎండిపోతాయి. అంటే ఇది నగర ఆరోగ్యాన్నే కాదు.. పరిసరాల జీవనవ్యవస్థనే దెబ్బతీసే ముప్పు. ఈ దారుణ పరిస్థితిపై ప్రభుత్వం కూడా స్పందించింది.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో ఎయిర్ క్వాలిటీ డ్యాష్బోర్డ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎయిర్క్వాలిటీని కొలిచే స్టేషన్ల సంఖ్యను పెంచింది. 2024లోనే 40 కొత్త మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి, రియల్టైమ్ డేటాను సేకరిస్తోంది. అంతేకాదు.. వాహనాల ఉద్గారాలు, నిర్మాణ పనులు, పరిశ్రమల కాలుష్యాన్ని లక్ష్యంగా చేసుకుని క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. రీన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి పెట్టడం, భారీ కాలుష్యం చేసే పరిశ్రమలను నగరాల నుంచి దూరంగా తరలించడం కూడా ఈ ప్రణాళికలో భాగం. అయితే డ్యాష్బోర్డులు చూపే సంఖ్యలు మన ఊపిరిని రక్షించగలవా?
ఎందుకంటే హైదరాబాద్ గాలిలోని ఈ విషం ఒక్కసారిగా దాడి చేయదు. అది నెమ్మదిగా మన శరీరాన్ని అలవాటు చేస్తూ చంపుతుంది. మనకు కనిపించదు. మనకు వినిపించదు. కానీ ప్రతి ఊపిరితో మనలోనే దాని ప్రభావం పెరుగుతుంది. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో జీవించడమంటే కేవలం ట్రాఫిక్, ఉద్యోగాలు, ఇంటి సమస్యలతో కాదు.. శుద్ధమైన గాలితో కూడా పోరాటం చేయడం కూడా ఇందులో భాగమే!
ALSO READ: ‘ఇండియా అసలు దేశమే కాదు..’ హైకోర్టులో మార్మోగిన బ్రిటీష్ పాలకుడి మాటలు!