ROKO: రోహిత్, కోహ్లీలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాక్ దిగ్గజం… 2027 వరల్డ్ కప్‌లో అసలు ఏం జరగబోతోంది..?

Roko

Roko

భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉందని, వారికేం వయసు అయిపోలేదని పాకిస్తాన్ బ్యాటింగ్ దిగ్గజం జహీర్ అబ్బాస్ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది (2027) దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగబోయే వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఖచ్చితంగా ఆడాలని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్, కోహ్లీ శైలికి సాటి లేదని, వారిద్దరూ పూర్తి ఫిట్‌నెస్‌తో రన్స్ చేస్తున్నప్పుడు కేవలం వయసును కారణం చూపి ప్రపంచకప్ జట్టు నుంచి పక్కన పెట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంగ్లాండ్‌లో రోహిత్ కొట్టిన సెంచరీ అద్భుతమని, ఆయన బ్యాటింగ్ టైమింగ్ చూడటం ఒక అనుభూతి అని కొనియాడారు. ఇదే సమయంలో బాబర్ ఆజం పునరాగమనంతో పాకిస్తాన్ క్రికెట్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరొకవైపు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా రోహిత్-కోహ్లీల భవిష్యత్తుపై టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లకు స్పష్టత ఉండాలని కోరారు. ఒకవేళ ఆ ఇద్దరినీ 2027 ప్రపంచకప్‌లో ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తే, వారి భుజం తట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని సూచించారు. “మళ్లీ ఫామ్ కోల్పోతే జట్టులో ఉంటామా లేదా అనే ఒత్తిడి లేకుండా వారిని స్వేచ్ఛగా ఆడనివ్వాలి. గతంలో నేను కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను, అందుకే వారి మానసిక స్థితి నాకు తెలుసు” అని యువీ పేర్కొన్నారు.

2027 వన్డే ప్రపంచకప్ సమయానికి రోహిత్ శర్మకు 40 ఏళ్లు, విరాట్ కోహ్లీకి 39 ఏళ్లు వస్తాయి. అయితే ఈ మధ్య రోహిత్ శర్మ వన్డేలకు రిటైర్మెంట్ ఇస్తున్నారంటూ వచ్చిన వార్తలను బిసిసిఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఈ ఇద్దరి అనుభవం భారత జట్టుకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.