NTV Telugu Site icon

Medarametla Siddham Meeting: మేదరమెట్లలో వైసీపీ సభకు సర్వం ‘సిద్ధం’.. సీఎం ప్రసంగంపై ఉత్కంఠ

Cm Ys Jagan

Cm Ys Jagan

Medarametla Siddham Meeting: బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్ధం సభ ద్వారా వైసీపీ శ్రేణులకు సీఎం జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు వివరించనున్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. చివరి సభకు ఏకంగా 15 లక్షల మందిని తరలించి సత్తా చాటాలనుకుంటోంది అధికార వైసీపీ. ఐదేళ్లలో బడుగు, బలహీన వర్గాల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి చేసిన కృషిని ముఖ్యమంత్రి జగన్ వివరిస్తారని అంటోంది. 6 జిల్లాల్లో 43 సెగ్మెంట్లు టార్గెట్‌గా బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభ నిర్వహించబోతోంది బాపట్ల జిల్లా మేదరమెట్లలో నాలుగో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు చేసింది. మేదరమెట్లలో సీఎం జగన్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు వచ్చే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి పనులు, రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చే సంక్షేమ పథకాలను సీఎం వివరించనున్నట్లు సమాచారం. సభకు 15 లక్షల మంది ప్రజలు సభకు విచ్చేసే అవకాశం ఉందని అంచనా.ఈ నేపథ్యంలో 4500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల దారి మళ్లింపు చేపడుతున్నారు.

సీఎం జగన్ సిద్ధం సభ షెడ్యూల్..
మధ్యాహ్నం 2.55 గంటలకు తాడేపల్లి లోని తన నివాసం నుంచి హెలిక్రాఫ్టర్ ద్వారా బయలుదేరనున్న సీఎం జగన్..

3.25 గంటలకు హెలిప్యాడ్ దగ్గరకు చేరుకోనున్న సీఎం జగన్..

3.35 గంటలకు సిద్ధం సభా వేదిక వద్దకు చేరుకోనున్న సీఎం జగన్..

3.40 నుండి 5.10 గంటల వరకు సిద్ధం సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్..

5.30 సభా పూర్తయిన అనంతరం సభాస్థలి నుంచి బయలుదేరి 6.00 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి తిరిగి చేరుకోనున్న సీఎం జగన్..

వాహనాల దారి మళ్లింపు వివరాలు:

1) నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ నుంచి సంఘమిత్ర హాస్పిటల్, కర్నూల్ రోడ్డు, చీమకుర్తి, పొదిలి దొనకొండ అడ్డరోడ్డు మీదుగా హైదరాబాద్ కు దారి మళ్లించనున్నారు.

2) హైదరాబాద్ వైపు నుండి ఒంగోలు వైపుకు వచ్చే భారీ వాహనాలను సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా దారి మళ్లించనున్నారు.

3) నెల్లూరు వైపు నుండి ఒంగోలు మీదుగా హైదరాబాదు వైపు వెళ్లే సాధారణ వాహనాలను మేదరమెట్ల వద్ద నుండి నామ్ హైవే పై అద్దంకి, సంతమాగులూరు మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

4) ఒంగోలు వైపు నుండి విశాఖపట్నం వైపు NH 16 పై వెళ్ళు వాహనాలను త్రోవగుంట నుండి NH 216 పైకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపడం జరుగుతుంది.

5) ఒంగోలు వైపు నుండి విజయవాడ, గుంటూరు వైపు NH 16 పై వెళ్ళు వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లించడమైనది.

6) ఒంగోలు వైపు నుండి చిలకలూరిపేట వైపు వెళ్ళు వాహనాలను త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా దారి మళ్లించడమైనది.

7) విశాఖపట్నం నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను నర్సాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించడమైనది.

8) గుంటూరు నుండి ఒంగోలు, చెన్నై వైపు వెళ్ళు వాహనాలను బుడంపాడు అడ్డరోడ్డు నుండి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించడమైనది.

9) చిలకలూరిపేట వైపు నుండి ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్ళు వాహనాలను పర్చూరు, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లించడమైనది.

10) 16 వ నంబర్ జాతీయ రహదారి పై మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుండి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబడవు కేవలం సిద్ధం సభ ప్రాంగణానికి వచ్చు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

11) అద్దంకి నుండి నాగులపాడు, వెంకటాపురం మీదుగా జాతీయ రహదారి పైకి ఏటువంటి వాహనాలను అనుమతించబడవు.