NTV Telugu Site icon

YS Jagan: ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉంది!

Ys Jagan

Ys Jagan

గవర్నర్ ప్రసంగం, బడ్జెట్‌పై మాట్లాడటం కోసం మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం వర్షన్ వినిపించే అవకాశం లేకపోవటంతో.. తమ వైపు నుంచి ప్రజలకు వివరించటం కోసమే ఈ సమావేశం అని తెలిపారు. సీఎం చంద్రబాబు వచ్చాక రెండు బడ్జెట్లలో ప్రజలను మోసం చేయటం ప్రస్ఫుటంగా కనిపిస్తుందన్నారు. ఎన్నికల ముందు చెప్పినట్లుగా గాక.. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్ అన్నారని విమర్శించారు. చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు ప్రతీ ఇంటికి కరపత్రాలు కూడా పంచారని జగన్ పేర్కొన్నారు.

‘అన్ని శాఖల కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. రెండు బడ్జెట్లలో అలాగే ఉన్నాయి. నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి అన్నారు. గత ఏడాది బడ్జెట్లో కూడా దాదాపు 7200 ఇవ్వాల్సిన భృతి ప్రస్తావన లేదు. ఈ ఏడాది కూడా భృతి ప్రస్తావన లేదు. బడ్జెట్లో గవర్నర్ ప్రసంగం తెలుగు కాపీలు అందరికీ పంపిణీ చేశారు. తొమ్మిది నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రింట్ చేసి మరీ అందరికీ పంపిణీ చేశారు. ఆ బుక్ లో పచ్చి అబద్ధాలు రాశారు. గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం.. బడ్జెట్ జరిగేటప్పుడే రెండవ సోషియో ఎకనామిక్ సర్వే అంటూ విడుదల చేశారు. 2024 -25 లో 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశామని రాసేశారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేశామని సీఎం చంద్రబాబు దారుణంగా చెబుతున్నారు’ అని వైఎస్ జగన్ మండిపడ్డారు.

‘పిల్లలకు ఇప్పటికే 72 వేల రూపాయలు ఒక్కొక్కరికీ ఇవ్వాలి. దగ, మోసం, వంచన ఇలా అన్నీ చేశారు. ఒక్క ఉద్యోగం ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలు మొత్తం వరుసపెట్టి పీకేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లో లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించాం. ఆప్కాస్ ద్వారా మరో లక్షా ముప్పై వేల ఉద్యోగాలు, రెండు లక్షల మందికి పైగా వాలంటీర్లు, మా ఐదు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు 6,31,310 ఉద్యోగాలు ఇచ్చాం. మేము చెప్పేది గారడీ లెక్కలు కాదు.. వీళ్ళ ప్రకారమే సోషియో ఎకనామిక్ సర్వేలోని డేటా ఇది. మొత్తంగా మా ఐదేళ్ల పాలనలో 40,13,552 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఆధార్ నంబర్ తో సహా చెప్పగలం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.