కాపు కులంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు టైగర్ అని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటిని దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. అన్నింటికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకోండని.. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండని వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఈరోజు జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
Also Read: YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘అంబటి రాంబాబును ఎందుకు అరెస్టు చేశారు?. మరి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలేవి?. తూతూమంత్రంగా అరెస్టు చేసి.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఇది జంగల్ రాజ్యం కాదా?. జోగి రమేష్ ఇంటిపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులేసి తగులపెట్టారు. మా వాళ్ళపై దాడులు చేసి.. వాళ్ళపైనే రివర్స్ కేసులు పెట్టారు. సీఎం చంద్రబాబు పాపాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. చంద్రబాబు చేసిన తప్పుకి దేవుడే సీబీఐ చేత మొట్టికాయలు వేయించాడు. కాపు కులంలో అంబటి ఒక టైగర్. గొప్పగా బ్రతికినాడు.. విలువలతో కూడిన వ్యక్తిత్వం కలవాడు. సీనియర్ లీడర్.. మాజీ మంత్రి. స్టేషన్లో అలాంటి వ్యక్తిని కొడతారా?. ఎల్లకాలం ఇలానే అన్యాయం చేస్తే.. మీ ప్రభుత్వమే ఉండదు గుర్తు పెట్టుకోండి. మూడేళ్ళల్లో మా ప్రభుత్వం వస్తుంది.. జాగ్రత్త. వడ్డీతో సహా చెల్లిస్తాం.. తప్పు చేసిన వాళ్ళని న్యాయ పరంగా బొక్కలో పెట్టి బుద్ది చెప్తాం. దెబ్బ తిన్న మా వాళ్ళు రేపు ఊరుకుంటారా?. మేము వచ్చాక మా వాళ్ళు ఇలానే స్పందిస్తే మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు కూడా ఇస్తాం. కేంద్ర స్థాయిలో వీళ్ళ పాపాలు తీసుకుని వెళ్తాం. సీబీఐ రిపోర్ట్ ఇచ్చాక మళ్లీ కమిటీలు ఏంటి?. చేసిన తప్పు బయట పడేసరికి కమిటీ అంటున్నాడు’ అని జగన్ రెడ్డి ఫైర్ అయ్యారు.