NTV Telugu Site icon

YS Jagan: నెల రోజుల్లో ఇసుకను దోచేశారు.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

Ys Jagan

Ys Jagan

YS Jagan: 5 నెలల చంద్రబాబు పాలనలో డీబీటీ ఎక్కడ మచ్చుకైనా కనపడటం లేదని.. డీపీటీ మాత్రమే కనిపిస్తోందని.. డీపీటీ పాలన అంటే దోచుకో పంచుకో తినుకో మాత్రమే చంద్రబాబు పాలనలో ఉందని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ విమర్శించారు. సూపర్ సిక్స్ లేదు సూపర్ 7 కూడా లేదన్నారు. ప్రజలు నిలదీస్తారని భయపడి కనీసం బడ్జెట్ పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఇదేనంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. దేశంలో ఈ విధానం ఓటాన్ బడ్జెట్ నడుపుతున్న ప్రభుత్వం ఇదేనన్నారు. బడ్జెట్ ప్రవేశ పెడితే సూపర్ సిక్స్ ఎక్కడ అని ప్రజలు అడుగుతారని భయపడుతున్నారని అన్నారు. ఇసుక మొదలు మద్యం, పేకాట క్లబ్బులు విచ్చల విడిగా కనిపిస్తున్నాయన్నారు. మైనింగ్ చేయాలని అనుకున్నా పరిశ్రమలు పెట్టాలన్నా కప్పం కట్టాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేకు, సీఎంకు కప్పం కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో మాఫియా నడుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.ఎన్నికల సమయంలో మాత్రం అబద్ధాలకు రెక్కలు కట్టడం, అబద్ధాలు చెప్పటం చేశారన్నారు.

వాలంటీర్లను నెలకు 10వేలు జీతం పేరుతో మోసం అంటూ మొదలు పెట్టారని.. ప్రతి ఇంటికి వెళ్లి అబద్ధపు మాటలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని వైఎస్ జగన్ అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాత్రం రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ప్రచారం మొదలుపెట్టారన్నారు. ప్రశ్నించే స్వరం ఉండకుండా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని జగన్ పేర్కొన్నారు. మార్పుల పేరుతో స్కాములను తెర లేపుతున్నారని.. అవినీతి చేస్తున్నారనటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఇసుక దోపిడీ కోసం అనేక స్కెచ్‌లు వేశారని.. ఎన్నికల ముందు ఇసుక ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రచారం చేశారన్నారు. 141 నియోజక వర్గాల్లో లారీ ధర సుమారు 20 వేలు ఉందని.. 53 నియోజక వర్గాల్లో 30 వేల పైన ఉందని.. కొన్ని చోట్ల లారీ 60 వేల పైన ఉందని.. ఇసుక ఉచితమని ఒకవైపు చెబుతూ మరోవైపు రాష్ట్రానికి గతంలో వచ్చే ఆదాయం సున్నా అయిందన్నారు. ధరలు చూస్తే గత ప్రభుత్వం కంటే రెండింతలు పెరిగాయన్నారు. మా ప్రభుత్వము 80 లక్షల టన్నులు పెడితే నెలరోజుల్లో సగం పైగా కొత్త ప్రభుత్వం రాగానే దోచేశారని జగన్ విమర్శించారు. 108 రీచ్ లకు 2 రోజుల సమయం ఇచ్చి టెండర్లు పిలిచారన్నారు. అందరూ దసరా పండుగలో ఉంటే వీళ్ళు టెండర్లు పిలిచారని.. 2 రోజుల్లో ఎవరైనా ఇలా చేయటం చేశారా అంటూ ప్రశ్నించారు.

Read Also: CM Chandrababu: లిక్కర్, ఇసుక వ్యాపారంలో జోక్యం చేసుకోవద్దు.. సీఎం క్లియర్ వార్నింగ్

టెండర్లలో ఎవరూ పాల్గొనకూడదు, పాల్గొంటే బెదిరించడం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం దగ్గరుండి తమ వారికి దోపిడీకి సహకరించటం చేస్తున్నారని ఆరోపించారు. ఇంత దారుణంగా మాఫియాను ఏపీలో నడుపుతున్నారని ఆరోపణలు చేశారు. 2014 నుంచి 2019 వరకు ఇదే విధంగా పాలన జరిగిందన్నారు.బీజేపీతో భాగస్వామిగా ఉండటంతో అసలు భయపడకుండా వ్యవహరిస్తున్నారని జగన్ అన్నారు. వైసీపీ హయంలో ఇసుక పాలసీ పారదర్శకంగా నిర్వహించామన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్లాట్ ఫాంపై ఈ టెండర్లు పిలిచామన్నారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చేలా హయ్యెస్ట్ బిడ్డర్‌కి కాంట్రాక్టు ఇచ్చామన్నారు. ఏడాదికి 750 కోట్లు ఆదాయం వచ్చేలా ఇసుక టెండర్లు పిలిచామని జగన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఇపుడు సున్నా అంటూ వెల్లడించారు. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అంటున్నారన్నారు. ప్రతి వారం ఇసుక అమ్మకాల ధరలపై ప్రకటనలు ఇచ్చామన్నారు. 20 డిస్టలరీలు ఉంటే 14 చంద్రబాబు హయాంలో వచ్చినవేనన్నారు. వైసీపీ హయాంలో ఒక్క డిస్టలరీకి కూడా లైసెన్స్ ఇవ్వలేదన్నారు. ఏ సినిమా పేరు బాగుంటే వాటి పేర్లు లిక్కర్‌కు పెడుతున్నారన్నారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా కొన్ని బ్రాండ్లు రిలీజ్ చేసి వెళ్ళారని.. 14-5-2019లో బూమ్ బూమ్ బీర్ అని పేరు పెట్టారన్నారు. అవే డిస్టిలరీలు బ్రాండ్లు మారతాయన్నారు. చంద్రబాబు సమయంలో ఇచ్చిన మద్యమే మా హయాంలో వచ్చిందన్నారు. చంద్రబాబు హయాంలో అదే మద్యం అమృతం మా హయంలో అదే మద్యం విషం అంటూ ఎద్దేవా చేశారు.

Read Also: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ తల్లికి ఊరట.. ముందస్తు బెయిల్‌ను సమర్థించిన సుప్రీంకోర్టు

మా హయంలో 30 షాప్స్ తగ్గించామన్నారు. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వంతో షాప్స్ నడిపామన్నారు. వైన్స్ షాప్స్‌కి టైం, పర్మిట్ రూమ్స్ రద్దు, బెల్ట్ షాప్స్ కట్టడి చేసేలా మేం చర్యలు తీసుకున్నామన్నారు. చంద్రబాబు హయాంలో 43 వేల బెల్ట్ షాప్స్ నడిచాయన్నారు. మద్యం ధరలు పెంచి మద్యం నియంత్రణ చేసేందుకు ప్రయత్నించామన్నారు. చంద్రబాబు హయాంలో అమ్మకాలు పెరగ్గా.. వైసీపీ హయాంలో అమ్మకాలు తగ్గాయి కానీ ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మద్యం నియంత్రించి ఆదాయాన్ని పెంచేందుకు వైసీపీ ప్రభుత్వం పనిచేసిందన్నారు. చంద్రబాబు మాత్రం మద్యం ధర తగ్గించి, క్వాలిటీ తగ్గించి, ఆదాయం తగ్గించి డిస్టిలరీకి వాల్యూం పెంచి సొంత ఆదాయం పెంచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ షాప్స్ రద్దు చేయటం పెద్ద స్కాం అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం షాప్స్ నడిపినపుడు అదే రోజు సాయంత్రం డబ్బులు జమ అయ్యేవన్నారు.

ఇపుడు తన మాఫియాకు మద్యం దుకాణాలు ఇచ్చేశారని విమర్శలు గుప్పించారు. 20 లేదా 30 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ప్రతి నియోజక వర్గంలో కూడా ఇదే విధంగా మద్యం మాఫియా పని చేస్తోందన్నారు. మద్యం పాలసీ మంచిదే అయితే ఎమ్మెల్యేలను ఎందుకు కిడ్నాప్‌లు, బెదిరింపులు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎంఆర్‌పీ రేటు కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు జరుగుతాయన్నారు. వైసీపీ హయంలో చీప్ లిక్కర్ 110 ఉంటే ఇప్పుడు 130 అమ్ముతున్నారన్నారు. 99కి క్వార్టర్ మద్యం కూడా ఒక స్కాం అంటూ జగన్ అన్నారు. కొద్దిరోజుల్లో అది కూడా బయటకు వస్తుందన్నారు. 120 క్వార్టర్ లిక్కర్‌లో క్వాలిటీ ఉంటుందా 99 లిక్కర్‌లో క్వాలిటీ ఉంటుందా ఆలోచించాలన్నారు. సారాయిలో రంగు పోసి అదే 99కి అమ్ముతారా అంటూ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ మండిపడ్డారు.