బీహార్ యూట్యూబర్ మనీష్ కశ్యప్ బీజేపీలో చేరారు. ఢిల్లీ ఎంపీ మనోజ్ తీవారి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమానికి ఆయన తల్లి కూడా హాజరయ్యారు. మనీష్ కశ్యప్.. తరచుగా ప్రధాని మోడీకి మద్దతుగా వీడియోలు చేస్తుంటారు. ఇతనికి 80 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. బీహార్ నుంచి వలస వచ్చిన వారిపై తమిళనాడులో వేధింపులకు గురవుతున్నట్లు నకిలీ వీడియోలను ప్రసారం చేసినందుకు గత ఏడాది అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకే బీజేపీలో చేరానని, తొమ్మిది నెలలు జైల్లో ఉన్నప్పుడు తన కోసం పోరాడిన తన తల్లి.. బీజేపీలో చేరాల్సిందిగా కోరిందని విలేకరులతో అన్నారు.
బీజేపీలో చేరిన అనంతరం మనీష్ కశ్యప్ అనేక విషయాలు మాట్లాడారు.. మనోజ్ తీవారి వల్లే తాను జైలు నుంచి బయటకు రాగలిగానని తెలిపారు. ప్రధాని మోడీకి తన తల్లి పెద్ద అభిమాని అని చెప్పారు. ఆ క్రమంలో ఆమె సలహా మేరకు తాను బీజేపీలో చేరినట్లు మనీష్ కశ్యప్ వివరించారు. బిహార్లో బీజేపీ బలపడేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అయితే బిహార్ రాష్ట్రాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం దోచేసిందని ఆరోపించారు. ఆ కుటుంబం రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని మండిపడ్డారు. బిహార్లోని కొన్ని రాజకీయ పార్టీల్లో చేరాలంటే మాత్రం సూట్ కేసులతో నగదు తీసుకు వెళ్లాల్సి ఉందని ఆరోపించారు. కానీ బీజేపీలో అలా కాదన్నారు. ఈ పార్టీ పేద కుటుంబానికి చెందిన తన లాంటి వారిని సైతం గౌరవం ఇస్తుందన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ బీజేపీ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీలో జాతీయ భావంతో తాను పని చేస్తానని స్పష్టం చేశారు. అయితే తాను జైల్లో ఉన్న సమయంలో పలు పార్టీలు తనపై ఆరోపణలు గుప్పించాయని చెప్పారు ఆ సమయంలో తనకు బీజేపీ నాయకులు ఇచ్చిన మద్దతు అంతా ఇంతా కాదన్నారు. ఈ రోజు సురక్షితంగా జైలు నుంచి బయటకు వచ్చానంటే.. అందుకు తన తల్లి ఆశీర్వాదంతో పాటు బీజేపీ నాయకుల మద్దతు కూడా ఉందన్నారు.
తమిళనాడులో బిహార్ నుంచి వలస వచ్చిన వారిపై స్థానికులు దాడులు చేస్తున్నట్లు మనీష్ కశ్యప్ ఓ నకిలీ వీడియోని సృష్టించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో 2023, మార్చిలో మనీష్ కశ్యప్ను పోలీసులు అరెస్ట్ చేసి.. తమిళనాడుకు తరలించారు. దీంతో కొన్ని నెలలపాటు మధురై జైల్లో ఉన్నారు. అనంతరం అతడిని బీహార్ జైలుకు తరలించారు. ఆ తర్వాత 2023, డిసెంబర్లో మనీష్ కశ్యప్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే అతడి వీడియోలతో.. అటు తమిళనాడు, ఇటు బీహార్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ స్పందించారు. ఇటువంటి పుకార్లను నమ్మవద్దంటూ.. బీహారీలకు సూచించారు. బీహార్కు చెందిన మనీష్ కశ్యప్.. ప్రముఖ యూట్యూబర్. మనీష్ కశ్యప్ సన్ ఆఫ్ బీహార్ పేరు మీద ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే ఈ యూట్యూబ్ చానెల్ ప్రజలను ఆకట్టుకుంది. అతడి వీడియో చానెల్కు 8.75 మిలియన్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.