NTV Telugu Site icon

Modi In USA: “మీరే భారత బ్రాండ్ అంబాసిడర్లు”.. ప్రవాసులపై మోడీ ప్రశంసలు..

Pm Modi

Pm Modi

Modi In USA: భారతదేశానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ అమెరికాలోని ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో పర్యటిస్తున్న మోడీ ఈ రోజు న్యూయార్క్‌లోని నసావు కొలీజియంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. లాంగ్ ఐలాండ్‌లోని కొలీజయం వద్దకు ప్రధాని రాగానే ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ‘‘మోడీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’’ ఈవెంట్‌‌కి 14 వేల మంది ఎన్ఆర్ఐలు, సెలబ్రిటీలు, ఇండో అమెరికన్ కమ్యూనిటీ తరలించి వచ్చింది. ‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నమస్తే యూఎస్ అంటూ విష్ చేశారు.

తాను ఇక్కడికి సుదూర తీరాల నుంచి వచ్చానని, గతంలో నేను ఓ పార్టీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని, ఏ పదవి లేనప్పుడు అమెరికాలోని 29 రాష్ట్రాలు తిరిగానని చెప్పారు. ఎన్ఆర్ఐలు భారత్ అమెరికా మధ్య అనుసంధానకర్తలుగా ఉన్నారని అన్నారు. మీరంతా మన దేశానికి ప్రతినిధులు, దూతలుగా ఉన్నారని అన్నారు. భిన్నత్వాన్ని అర్థం చేసుకుని జీవించడం మన మూలాల్లోనే ఉందని, భాషలు అనేకం భావం ఒక్కటే అని, మనం ఎక్కడికెళ్లిన ఒక కుటుంబంలా వ్యవహరిస్తామని అన్నారు.

Read Also: Iran: ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై పేలుడు.. 51 మంది మృతి

భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భారత్‌లో ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. అమెరికా మొత్తం జనాభా కంటే భారత్‌లో రెట్టింపు ఓటర్లు ఉన్నారని, భారత ప్రజాస్వామ్యం యొక్క ఈ స్థాయిన చూసినప్పుడు మేము మరింతగా గర్వపడుతున్నామని చెప్పారు. ప్రపంచానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, నాకు మాత్రం ఏఐ అంటే అమెరికా-ఇండియా అని అన్నారు.

ప్రపంచంలో తాను ఎక్కడి వెళ్లినా, ప్రతీ నాయకుడు ప్రవాస భారతీయులను కొనియాడుతారని, నిన్న ప్రెసిడెంట్ బైడెన్ తనను డెలావర్‌లోని అతని ఇంటికి తీసుకెళ్లారని, అతడి ఆప్యాయత నాకు హృదయానికి హత్తుకునే క్షణమని, ఆ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కతుందని అన్నారు. ఈ రోజు భారతదేశం 5జీ మార్కెట్ అమెరికా కన్నా పెద్దదని, కేవలం రెండేళ్లలోనే ఇది సాధ్యమైందని,ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా 6జీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామని, ప్రస్తుతం ఇండియా అవకాశాలకు నిలయమని చెప్పారు.