Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!

Rentachintala Kurnool Murders

Rentachintala Kurnool Murders

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు హత్య ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురికాగా.. కర్నూలులో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రెంటచింతలలో వైసీపీ నేత దారుణ హత్య:
పల్నాడు జిల్లా రెంటచింతలలో వైసీపీ నేత నవులూరి చెన్నారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. రెంటచింతల నుంచి రెంటాల వెళ్లే మార్గంలో పులోళ్ల బావి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రెంటచింతల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య:
మరోవైపు కర్నూలులో టీడీపీ కార్యకర్త షేక్ ఇంతియాజ్ బాషా (37) హత్యకు గురయ్యారు. మాసుంబాషా దర్గా సమీపంలో టీడీపీకి చెందిన షేక్ జవాజ్, వైసీపీకి చెందిన ఇర్ఫాజ్‌తో ఇంతియాజ్‌కు ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం జవాజ్, ఇర్ఫాజ్ కలిసి ఇంతియాజ్‌పై రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇంతియాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంతియాజ్, జవాజ్-ఇర్ఫాజ్ మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన ఇర్ఫాజ్ గతంలో ఓ బంగారు వ్యాపారి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు.

పల్నాడు, కర్నూలులో జరిగిన ఈ రెండు హత్య ఘటనలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులు హత్యకు గురికావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరు కేసుల్లోనూ హత్యలకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పాత్ర, రాజకీయ కారణాలున్నాయా లేదా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.