AP Crime: వైసీపీ నేత హత్యతో వణికిపోతున్న సీతారామపురం

  • నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురంలో దారుణం
  • వైసీపీ నేత సుబ్బరాయుడు ఇంటికిపై దాడి చేసి హత్య చేసిన ప్రత్యర్థులు
  • దాడికి పాల్పడిన 40 మంది దుండగులు
Ap Crime

Ap Crime

AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా నంద్యాల జిల్లాలో సంచలనం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలోని సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బారాయుడిని దుండగులు రాళ్లతో అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. 40 మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు తన భర్తను హతమార్చారంటూ మృతుడి భార్య ఆరోపించారు. అయితే, మృతుడు సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణికి అత్యంత సన్నిహిత అనుచరుడిగా తెలుస్తోంది. ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పికెట్ ఏర్పాటు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నంద్యాల ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బరాయుడు హత్యతో సీతారాంపురం గ్రామం వణికిపోతోంది. గ్రామాన్ని ఎస్పీ అదిత్‌ రాజ్‌ సింగ్‌ రాణా సందర్శించారు. నంద్యాల జీజీహెచ్‌లో సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను ఎస్పీ అదిత్ సింగ్ రాణా విచారించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఓటెయ్యనందుకే హత్య జరిగినట్లు తెలుస్తోందని ఆయన వెల్లడించారు.

Read Also: Rangareddy Crime: దొంగతనం చేసిందనే అనుమానం.. మహిళను చితకబాదిన పోలీసులు