యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి 2022 – 2025 సంవత్సరాలకు గాను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ “గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్” (ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం) అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్య క్షేత్రానికి ఈ ప్రఖ్యాత అవార్డు దక్కడం సంతోషకరమని, స్వయంపాలనలో తెలంగాణ దేవాలయాలకు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కడం భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవమని సీఎం కేసీఆర్ అన్నారు.
Also Read : Finance Fraud : చిట్టీల పేరుతో మాజీ ఏఎస్సై 5 కోట్ల టోకరా..
ప్రజల మనోభావాలను, మత సాంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యాదగిరిగుట్ట పునర్నిర్మాణం, ఆ ప్రసిద్ధ దేవాలయానికి ‘ఆధ్యాత్మిక హరిత పుణ్య క్షేత్రం’ అవార్డు రావడం భారతీయ ఆధ్యాత్మిక పునురుజ్జీవన వైభవానికి నిదర్శనంగా నిలిచిందని సీఎం తెలిపారు. యాదాద్రి ఆలయ పవిత్రతకు, ప్రాశస్త్యానికి భంగం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆధునీకరణ పనులను ‘ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్’ ప్రశంసించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన అపూర్వ గౌరవమని సీఎం అన్నారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రాన్ని భక్తులకు మరింత చేరువ చేసేందుకు సంప్రదాయబద్ధంగా పునఃప్రతిష్ఠ చేసిందని సీఎం తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా యాదగిరి పంచ నరసింహ స్వామి కృపాకటాక్షాలు ప్రజలపై ఉండాలని సీఎం ఈ సందర్భంగా ప్రార్థించారు.