Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..

Xi Jinping

Xi Jinping

Xi Jinping: ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మళ్లీ భారత గడ్డపై అడుగుపెట్టారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్య్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు శనివారం ఉదయం 11:40 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు వచ్చిన ఆయన, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో భారత్ మంటపంలో జరిగే రెండు రోజుల సదస్సులో భాగం కానున్నారు. జిన్‌పింగ్ కాన్వాయ్‌లో సీపీసీ సెంట్రల్ కమిటీ జనరల్ ఆఫీస్ డైరెక్టర్ కై కీ, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వంటి కీలక నేతలు కూడా ఉన్నారు.

ఈ పర్యటనలో అందరి దృష్టి ప్రధాని మోడీ, జిన్‌పింగ్‌ల మధ్య జరగనున్న ద్వైపాక్షిక భేటీపైనే నెలకొంది. గతంలో 2019లో చెన్నైలో జరిగిన అనధికారిక సదస్సు తర్వాత జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే, అక్టోబర్ 2024లో సరిహద్దుల వద్ద దళాల ఉపసంహరణ (డిస్‌ఎంగేజ్‌మెంట్)పై ఒప్పందం కుదిరిన నాటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు మళ్లీ పుంజుకోవడం ప్రారంభించాయి. సరిహద్దుల్లో సైనిక మోహరింపులు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాణిజ్య, వ్యాపార సంబంధాలు క్రమంగా సర్దుమణుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న మోడీ-జిన్‌పింగ్ భేటీలో ఇరు దేశాల సంబంధాల పురోగతిని సమీక్షించడంతో పాటు వాణిజ్యం, మార్కెట్ యాక్సెస్, సరిహద్దు వివాదాల పరిష్కారం వంటి కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. భేటీకి ముందే చైనా కూడా భారత్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఆసక్తి చూపింది. ఇరు దేశాలు తమ విభేదాలను సరిగ్గా మేనేజ్ చేసుకుంటూ, సమాచార మార్పిడి మరియు సహకారాన్ని పెంచుకోవాలని బీజింగ్ పిలుపునిచ్చింది.

ప్రస్తుతం 11 సభ్య దేశాలతో విస్తరించిన బ్రిక్య్స్ కూటమికి భారత్ 2026లో అధ్యక్షత వహిస్తోంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ సదస్సులో ఆర్థిక సహకారం, వాణిజ్యం-పెట్టుబడులు, సాంకేతికత, ఇంధన, ఆహార భద్రతతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు, అమెరికా-చైనా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య ఈ సమావేశం జరుగుతోంది. ఒకవైపు గ్లోబల్ సూపర్ పవర్స్‌తో వ్యూహాత్మక బంధాన్ని కాపాడుకుంటూనే, మరోవైపు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడానికి భారత్ ఈ సదస్సును వేదికగా మలుచుకుంటోంది.