WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..

Wtc 2025 27

Wtc 2025 27

WTC 2025-27: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో భారత్ నిలవడం అత్యంత సంక్లిష్టంగా మారింది. ప్రస్తుతం టీమిండియా ఆడిన 9 టెస్టుల్లో 4 విజయాలతో 48.15 శాతం పాయింట్లతో (PCT) ఐదో స్థానానికి పరిమితమైంది. అంతేకాకుండా, పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆస్ట్రేలియా 87.50 PCTతో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా (75), న్యూజిలాండ్ (72.22), బంగ్లాదేశ్ (58.33) వరుసగా భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.

భారత్ ఖాతాలో ఇంకా 9 టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో ఇకపై ఎలాంటి పొరపాట్లకు తావులేదు. టీమిండియా తన మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే పాయింట్ల శాతం 74.07కు చేరి ఫైనల్ బెర్త్ దాదాపు ఖాయమవుతుంది. అయితే, ఒక మ్యాచ్‌లో ఓడితే పాయింట్ల శాతం 68.5కు, రెండు ఓటములతో 62.9కు, మూడు ఓటములు ఎదురైతే 57.41కి పడిపోతుంది. WTC నిబంధనల ప్రకారం ప్రతి విజయానికి 12 పాయింట్లు, డ్రాకు 4 పాయింట్లు లభిస్తాయి, కాబట్టి ఒక్క ఓటమి కూడా భారీ ప్రభావం చూపుతుంది.

టీమిండియా ముందున్న షెడ్యూల్ ఎంతో సవాల్‌తో కూడుకున్నది. భారత్ మొదట శ్రీలంక పర్యటనలో రెండు టెస్టులు ఆడనుంది, అక్కడ స్పిన్ ఎదుర్కొవడం పెద్ద పరీక్షగా మారనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో మరో రెండు టెస్టుల్లో పోటీపడాల్సి ఉంటుంది. చివరగా, ప్రపంచ నంబర్-1 టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాతో స్వదేశంలో 5 మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో భారత్ కేవలం తన మ్యాచ్‌లను గెలవడమే కాకుండా, ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇకపై ఆడే ప్రతి మ్యాచ్‌ను నాకౌట్‌గా భావించి వరుస విజయాలు సాధిస్తేనే WTC ఫైనల్ కలను నిజం చేసుకోగలదు.