Women’s World Cup 2026 – India: 2026 మహిళల ప్రపంచకప్లో గ్రూప్ A నుండి సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గ్రూప్ A లోని జట్లన్నీ నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా జట్లు నాకౌట్ బెర్త్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా వరుసగా నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి దాదాపు సెమీఫైనల్ స్థానం ఖాయం చేసుకుంది. మరోవైపు భారత్, దక్షిణాఫ్రికా జట్లు చెరో మూడు విజయాలతో 6 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం భారత్కు నెట్ రన్రేట్ భారీగా ప్లస్లో ఉండటం పెద్ద ఊరటనిచ్చే అంశం. భారత జట్టు నెట్ రన్రేట్ +2.268 కాగా, దక్షిణాఫ్రికా +0.734తో ఉంది. దీంతో చివరి మ్యాచ్ల ఫలితాలు సెమీస్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.
దక్షిణాఫ్రికా ఓడితే భారత్కు నేరుగా సెమీస్:
దక్షిణాఫ్రికా తన చివరి లీగ్ మ్యాచ్ను బంగ్లాదేశ్తో ఆడనుంది. ఒకవేళ ఆ మ్యాచ్లో అద్భుతం జరిగి బంగ్లాదేశ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడితే.. భారత్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో గెలిచినా, ఓడినా సెమీఫైనల్కు చేరుతుంది. దీనికి కారణం.. రెండు జట్లకు 6 పాయింట్లు సమానంగా ఉన్నా, భారత్ నెట్ రన్రేట్ చాలా మెరుగ్గా ఉండటం.
దక్షిణాఫ్రికా గెలిస్తే.?
ఒకవేళ దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్పై విజయం సాధిస్తే.. ఆ జట్టు 8 పాయింట్లతో ముందుకు వెళ్తుంది. ఈ పరిస్థితిలో భారత్ కూడా ఆస్ట్రేలియాపై తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. భారత్ విజయం సాధిస్తే ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా మూడు జట్లు 8 పాయింట్లతో సమంగా నిలుస్తాయి. అప్పుడు సెమీఫైనల్కు వెళ్లే రెండు జట్లను నెట్ రన్రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం భారత్ రన్రేట్ దక్షిణాఫ్రికా కంటే చాలా మెరుగ్గా ఉండటంతో టాప్-2లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఓడితే టోర్నీకి గుడ్బై:
భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి, అదే సమయంలో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్పై గెలిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో సెమీఫైనల్కు అర్హత సాధిస్తే.. భారత్ 6 పాయింట్లతోనే నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.
కీలకంగా ఆస్ట్రేలియా మ్యాచ్:
మొత్తానికి భారత మహిళల జట్టుకు ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. నెట్ రన్రేట్ పరంగా భారత్ బలంగా ఉన్నప్పటికీ.. సెమీఫైనల్ బెర్త్పై ఎలాంటి సందేహాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే ఆస్ట్రేలియాపై విజయం సాధించడమే ఉత్తమ మార్గం.

