అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ‘బెర్ముడా’ దీవి శాస్త్రవేత్తలకు దశాబ్దాలుగా ఒక పెద్ద పజిల్ లా మారింది. అక్కడి అగ్నిపర్వతాలు 3 కోట్ల సంవత్సరాల క్రితమే అంతరించిపోయినా, ఆ దీవి మాత్రం సముద్ర మట్టానికి దాదాపు 1,600 అడుగుల ఎత్తులో స్థిరంగా ఎలా ఉందనేది ఎవరికీ అర్థం కాలేదు. సాధారణంగా అగ్నిపర్వతాలు చల్లారిన తర్వాత కాలక్రమేణా ఆ ప్రాంతాలు సముద్రంలోకి కుంగిపోవాలి. కానీ, బెర్ముడా విషయంలో అలా జరగలేదు.
తాజాగా అమెరికా శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించారు. భూకంప తరంగాల సహాయంతో వారు బెర్ముడా భూగర్భాన్ని పరిశోధించారు. భూమి లోపల ఉండే పొరల గుండా ఈ తరంగాలు ప్రయాణించే వేగాన్ని బట్టి, అక్కడ ఏముందో గుర్తించారు. ఈ పరిశోధనలో బెర్ముడా దీవి కింద దాదాపు 12 మైళ్ల మందపాటి ఒక ప్రత్యేకమైన రాతి పొర ఉన్నట్లు తేలింది.
ఈ రాతి పొర చుట్టుపక్కల ఉండే భూగర్భ పొరల కంటే చాలా తక్కువ బరువు (సాంద్రత) కలిగి ఉంది. అందువల్ల, ఇది సముద్రంపై ఒక ‘తెప్ప’ లేదా ‘లైఫ్ జాకెట్’ లా పనిచేస్తూ, బెర్ముడా దీవి కిందకు కుంగిపోకుండా పైకే పట్టి ఉంచుతోంది. కోట్లాది సంవత్సరాల క్రితం ‘పాంజియా’ అనే మహాఖండం ఏర్పడిన కాలంలో, భూమి లోపలి నుంచి వచ్చిన కార్బన్ రసాయనాలు కలిగిన ద్రవరూప లావా… భూమి పైపొరల్లోకి చేరి గట్టిపడటం వల్లే ఈ తేలికపాటి రాతి పొర ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ప్రపంచంలో మరెక్కడా లేని ఇటువంటి వింతైన భూగర్భ నిర్మాణం బెర్ముడా కింద మాత్రమే ఉందని పరిశోధకులు చెప్తున్నారు. భూమి లోపల జరిగే మార్పులను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఎంతో సహాయపడుతుందని వారు పేర్కొన్నారు.
