NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

నేడు 8వ రోజు సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. తిరుపతిలోని గురువరాజు పల్లెలో ఉదయం 9 గంటలకు జగన్ బస్సు యాత్ర ఆరంభం కానుంది. మల్లవరం, ఏర్పేడు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్.. అక్కడి నుంచి సింగనమల మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు డ్రైవర్స్ అసోసియేషన్స్ తో జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కాళహస్తి నాయుడుపేటలో బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

నేడు కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు కొవ్వూరు చేరుకోనున్నారు. చాగల్లు రోడ్డు నుండి విజయ విహార్ సెంటర్ వరకు రోడ్ షో అనంతరం ప్రజాగళం సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం గోపాలపురం పర్యటనకు బాబు వెళ్లనున్నారు.

నేడు అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురంలో ఉమ్మడి జిల్లా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చర్చ జరగనుంది.

నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొననున్నారు. బేతంచెర్ల మండలం, హెచ్.కొట్టాల, గోరుమానుకొండ, పాణ్యం మండలం, భూపనపాడులో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించనున్నారు. నంద్యాలలో ఎస్.ఎన్.ఫంక్షన్ హాల్లో ఆమె బస చేయనున్నారు.

ఏపీలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తొలిరోజు 25 లక్షల 66 వేల మంది లబ్దిదారులకు పెన్షన్ అందింది. ఈరోజు మరింత మంది లబ్దిదారులకు పెన్షన్ అందనుంది. ఈ నెల 6 వరకు పెన్షన్ ఇవ్వనున్న విషయం తెలిసిందే.

నేటి నుంచి సుజనా చౌదరి తన ప్రచారం ప్రారంభించనున్నారు. వన్ టౌన్ వినాయకుడి ఆలయంలో పూజలు చేసి ప్రచారం, పార్టీ కార్యాలయంను సుజనా చౌదరి ప్రారంభించనున్నారు.

నేడు నూతన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు.. తెలంగాణ నుంచి ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు.

ఈరోజు రౌస్ ఎవిన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కవిత పిటిషన్‌ను జడ్జి కావేరి బావేజా విచారించనున్నారు. గత నెల 15న లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్‌లో భాగంగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు.

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.