BJP Journey In West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సమీకరణాలు ఒక్కసారిగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) మూడు పర్యాయాల పాలనకు చరమగీతం పాడుతూ, భారతీయ జనతా పార్టీ (BJP) జెండా ఎగురవేస్తుంది. సుమారు 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత బెంగాల్లో బీజేపీ ప్రభంజనం కనిపిస్తోంది. మొత్తం 294 స్థానాలకు గానూ మేజిక్ ఫిగర్ 148ని బీజేపీ ఇప్పటికే దాటేయగా, అధికార తృణమూల్ కాంగ్రెస్ 115 స్థానాల వద్ద వెనుకబడి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ ప్రస్థానం 90స్ నుంచే మొదలైనప్పటికీ, అక్కడ ఎప్పుడూ లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ లేదా టీఎంసీలదే హవా నడిచింది. కానీ గత పదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటు బ్యాంకును భారీగా పెంచుకున్న బీజేపీ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచుకుని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
అక్రమ వలసలు, హిందుత్వ అజెండా, అభివృద్ధి నినాదం వంటి అంశాలు ఆ పార్టీ ఎదుగుదలకు ఇంధనంగా మారాయి. కోల్కతాకు చెందిన జర్నలిస్ట్ స్నిగ్ధేందు భట్టాచార్య తన ‘మిషన్ బెంగాల్’ పుస్తకంలో వివరించినట్లుగా, 2011 నుంచి మమతా బెనర్జీ పాలనలో ఆర్ఎస్ఎస్ (RSS) వేగంగా విస్తరించడం, వామపక్షాల పతనం వల్ల ఏర్పడిన రాజకీయ శూన్యాన్ని బీజేపీ సమర్థవంతంగా భర్తీ చేసింది. హిందూ ధృవీకరణ, టీఎంసీపై ఉన్న తీవ్ర వ్యతిరేకత బీజేపీకి కలిసివచ్చాయి. భవానీపూర్లోని బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలు సైతం ఇదే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అవినీతి, సిండికేట్ రాజ్, గూండాయిజంతో ప్రజలు విసిగిపోయారని, ఈసారి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లో కూడా సువేందు అధికారి గెలుస్తారని వారు ఆశిస్తున్నారు.
గణంకాలను పరిశీలిస్తే 2019 లోక్సభ ఎన్నికలు బీజేపీకి ఒక మైలురాయిగా నిలిచాయి. 2014లో కేవలం 2 సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ, 2019లో ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. ఓటు శాతం 17 నుంచి 40 శాతానికి పెరగడం విశేషం. టీఎంసీకి, బీజేపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 3 శాతానికి తగ్గిపోయింది. ‘బ్యాటిల్గ్రౌండ్ బెంగాల్’ రచయిత సాయంతన్ ఘోష్ విశ్లేషణ ప్రకారం.. ఒకప్పుడు రాష్ట్రంలో చక్రం తిప్పిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు నామమాత్రంగా మిగిలిపోయి. ఓట్లన్నీ టీఎంసీ-బీజేపీల మధ్యే చీలిపోయాయి. ముఖ్యంగా వామపక్ష సానుభూతిపరులైన 40 శాతం ఓటర్లు బీజేపీ వైపు మళ్లడం ఒక సంచలనం. ప్రధాని మోడీ నిర్వహించిన దూకుడుగా సాగిన ప్రచారాలు హిందూ ఓటర్లను ఏకం చేశాయి. ఏప్రిల్ 25న ఠాకూర్ నగర్లో జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ, టీఎంసీ అహంకారాన్ని ప్రజలు ఓటుతో అణచివేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లతో అనూహ్య విజయం సాధించి బీజేపీ వేగానికి బ్రేకులు వేసినా, 2024 లోక్సభ ఎన్నికల్లో మళ్లీ సమీకరణాలు మారుతూ వచ్చాయి. చారిత్రక నేపథ్యం చూస్తే, బీజేపీ మూలాలు బెంగాలీయుడైన శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్లో ఉన్నాయి. 1952లో ఆ పార్టీ 9 సీట్లు గెలిచినా, ఆ తర్వాత ప్రాభవం కోల్పోయింది. 1982లో ఒక్క శాతం ఓటు కూడా సాధించలేని స్థితి నుంచి 1991లో 11.66 శాతం, 2016లో మొదటిసారి 3 అసెంబ్లీ సీట్లు, ఆపై 2021లో 77 సీట్లకు చేరడం బీజేపీ నిలకడైన వృద్ధికి నిదర్శనం. హిందీ హృదయ భూమికి పరిమితం కాకుండా, బెంగాల్ లాంటి భిన్నమైన సంస్కృతి ఉన్న రాష్ట్రంలో అధికారం చేపట్టడం బీజేపీ జాతీయ వ్యూహంలో అత్యంత కీలకం. కేంద్ర మంత్రి శాంతను ఠాకూర్ చెబుతున్నట్లుగా, అవినీతి రహిత పాలన కోసం ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. ఏప్రిల్ 29న జరిగిన తుది దశ ఎన్నికల తర్వాత నేడు వెలువడుతున్న ట్రెండ్స్ గమనిస్తే, దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ బెంగాల్ గడ్డపై కమలం వికసించబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవే ట్రెండ్స్ తుది ఫలితాలుగా మారితే, పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం అవుతుంది.
