NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : రెండేళ్లలో SLBC టన్నెల్ పనులను పూర్తి చేస్తాం

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

రెండేళ్లలో ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతోపాటు.. జిల్లాలో కరువుతో వ్యవసాయానికి దూరమైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు.. హైదరాబాద్ నగర త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులను రాబోయే రెండెళ్లలో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు అమెరికాలోని ఒహయోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ మ్యాన్ ఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈఓ లాక్ హోం తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా టన్నెల్ తవ్వకానికి ఉపయోగించే అధునాతన నిర్మాణ మెషినరీని సీఈఓ లాక్ హోం మంత్రికి చూపించి వాటి పనితీరు గురించి వివరించారు. అనంతరం లాక్ హోం తో సమావేశమైన మంత్రి.. టన్నెల్ తవ్వకానికి ఇబ్బందిగా మారిన బేరింగ్ తో పాటు ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను వీలైనంత త్వరగా సమకూర్చాలని కోరారు. ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పూర్తయితే 3 లక్షల ఎకరాలకు ఎలాంటి పంపింగ్ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని.. మరియు ఉదయ సముద్రం లో భాగమైన బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా మరో లక్ష ఎకరాలకు పంపింగ్ ద్వారా సాగునీరు అందుతుందని. మొత్తంగా 4 లక్షల ఎకరాల భూములకు సాగునీటి సదుపాయం కలిగించే ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులు.. బేరింగ్ తో పాటు ఇతర రిపేర్లతో ఆగిపోయాయని.. స్వయంగా ప్రభుత్వమే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నందున బేరింగ్ తో పాటు ఇతర పరికరాలను వీలైనంత త్వరగా అందించాలని రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

తవ్వకానికి అవసరమైన స్పేర్ పార్ట్స్ అందించడంలో ఆలస్యం జరుగుతున్న తరుణంలో స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రంగంలోకి దిగి ప్రాజెక్టు పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ కు వివరించారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రాజెక్టు పనులకు బిల్లులు చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకున్నందున బేరింగ్ తో పాటు ఇతర స్పేర్ పార్ట్స్ ను వీలైనంత త్వరగా సమకూరిస్తే.. తక్షణం చెల్లింపులు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వివరించారు. గ్రీన్ ఛానెల్ అమల్లో ఉన్నందున పనులు జరిగిన 40 రోజుల్లనే చెల్లింపులు చేసే విధానం గురించి రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోంకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరణతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన లాక్ హోం SLBC టన్నెల్ నిర్మాణంలో ప్రధాన బేరింగ్ తో పాటు ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. మరో రెండు నెలల్లో 7 డయామీటర్లు కలిగిన బేరింగ్ తో పాటు ఇతర స్పేర్ పార్ట్స్ ను షిప్ ద్వారా చెన్నైకి చేర్చుతామని అక్కడి నుంచి పనులు జరుగుతున్న ప్రాంతానికి పంపిస్తామని చెప్పారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును బ్లాస్టింగ్ ప్రక్రియలో పూర్తి చేసే అవకాశం ఏమాత్రం లేకపోవడం.. కేవలం టన్నెల్ బోరింగ్ ద్వారా మాత్రమే చేసే పరిస్థితులు ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రాబిన్స్ కంపెనీతో చర్చలు జరిపి పనులను ముందుకు తీసుకెళ్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్, సాగునీటి పారుదల శాఖ నల్గొండ సీఈ వి. అజయ్ కుమార్ మరియు జైప్రకాశ్ అసోసియేట్ కంపెనీ డైరెక్టర్ పంకజ్ గౌర్ గారు, రాబిన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.