Indian Team: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో భారత్ ఘటన విజయం సాధించింది. అమెరికాపై 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇంతలో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ జట్టుతో కలవబోతున్నాడు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరిగే మ్యాచ్కు ముందు నేరుగా భారత జట్టులో చేరుతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ అనంతరం స్పష్టం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సూర్య.. “వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు పూర్తిగా ఫిట్గా ఉన్నాడు. నమీబియా మ్యాచ్కు ముందు అతను ఢిల్లీలో జట్టుతో కలుస్తాడు” అని చెప్పాడు. ఇది అభిమానులకు పెద్ద ఊరటగా మారింది. ఎందుకంటే వరల్డ్ కప్ లాంటి కీలక టోర్నీలో ఆల్రౌండర్ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యం.
READ MORE: Siraj vs Surya Kumar: బ్యాగులు సర్దుకోమని చెప్పిన సూర్య.. షాక్ అయిన సిరాజ్
అయితే అదే సమయంలో సూర్య ఇంకొన్ని విషయాలు వెల్లడించాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు తీవ్ర జ్వరం వచ్చిందని, ఓపెనర్ అభిషేక్ శర్మ సైతం అనారోగ్యంగా ఉన్నట్లు చెప్పాడు. అభిషేక్ అస్వస్థత కారణంగా ఫీల్డింగ్ చేయలేకపోయాడు. ఆ సమయంలో 12వ ఆటగాడిగా ఉన్న సంజూ శాంసన్ చాలా సేపు ఫీల్డింగ్ బాధ్యతలు చేపట్టాడు. వాషింగ్టన్ సుందర్ విషయానికి వస్తే.. అతను ఇటీవల గాయాల వల్ల మైదానానికి దూరంగా ఉన్నాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో అతనికి పక్క భాగంలో గాయం, రిబ్ మసిల్ టియర్ అయ్యాయి. ఆ గాయాల కారణంగా టీ20 వరల్డ్ కప్కు ముందు జరిగిన టీ20 సిరీస్ను అతను మిస్ అయ్యాడు. అప్పట్లో అతను జట్టుకు దూరమవడం అభిమానులను నిరాశపరిచింది.
READ MORE: Funky : బూతులు తిట్టేసే విశ్వక్ సేన్ కాదు.. ఇప్పుడు తను మారాడు : నాగవంశీ
గాయం తర్వాత వాషింగ్టన్ చాలా కష్టపడ్డాడు. వైద్యులు సూచించిన విధంగా కఠినమైన రిహ్యాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేశాడు. ‘రిటర్న్ టు ప్లే’ నిబంధనలు అన్నింటినీ పాటించాడు. పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాతే వైద్య, స్పోర్ట్స్ సైన్స్ బృందం అతనికి మళ్లీ ఆడేందుకు అనుమతి ఇచ్చింది. గత వారం రోజులుగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వాషింగ్టన్ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నాడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్ల్లో సాధన చేస్తున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు అతను జట్టుతో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇదిలా ఉండగా, భారత జట్టు ఇప్పటికే ఒక కీలక ఆటగాడిని కోల్పోయింది. యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా మోకాలి గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఆ గాయం నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడే అవకాశం ఉందని టీమ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే, ఒకవైపు గాయాలు, అస్వస్థతలతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా.. మరోవైపు వాషింగ్టన్ సుందర్ లాంటి కీలక ఆటగాడు తిరిగి రావడంతో భారత జట్టుకు బలం చేకూరనుంది.
