Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది ఉద్యోగుల మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. ప్రస్తుతం మృతదేహాలను కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)లో భద్రపరిచారు.
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు వేడి ఉక్కు ద్రవం కారణంగా పూర్తిగా కాలిపోయాయి. ఎవరి మృతదేహమో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నారు. డీఎన్ఏ నివేదికలు వచ్చిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పట్టవచ్చని తెలిపారు.
ఈ ప్రమాదంలో గోల్డ్ కుమార్ (మేనేజర్), ప్రభాకరరావు (స్టాండ్-3 ఆపరేటర్), జి. భానుకుమార్ (షిఫ్ట్ ఇన్చార్జ్), కృష్ణ నాగు (స్టాండ్-4 ఆపరేటర్), రమణ (కాంట్రాక్ట్ వర్కర్), త్రినాథ్ (కాంట్రాక్ట్ స్టాండ్ ఆపరేటర్), ఎన్. అప్పలరాజు (కాంట్రాక్ట్ స్టాండ్ ఆపరేటర్), జీవీ అప్పారావు (సైడ్ ఆపరేటర్) మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ ఆత్మీయుల మృతదేహాలను కూడా గుర్తించలేని స్థితి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబాలకు ప్రధాన ఆధారంగా ఉన్న వ్యక్తులను కోల్పోవడంతో వారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. షిఫ్ట్ ఇన్చార్జ్ జి. భానుకుమార్కు మూడు నెలల పసిబిడ్డ ఉండగా, మరో ఉద్యోగి స్థానంలో విధులకు హాజరై ఈ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. అలాగే 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న రమణ మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బొకారో స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. ఎస్ఎంఎస్ విభాగంలో ల్యాడిల్ పేలుడు ఎలా జరిగింది, భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎందుకు సంభవించాయనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టనుంది. ప్రమాదానికి కారణమైన సాంకేతిక లోపాలు, ముడి పదార్థాల నాణ్యత, సిబ్బంది నైపుణ్యం, యంత్రాల పరిస్థితి వంటి అంశాలను కమిటీ పరిశీలించనుంది. ముఖ్యంగా దాదాపు 30 ఏళ్ల నాటి యంత్రాలు ఇంకా వినియోగంలో ఉండటం, గత రెండు నెలల్లో 27 సార్లు ల్యాడిల్కు రంధ్రాలు పడి ద్రవ ఉక్కు బయటకు వచ్చినట్లు కార్మిక సంఘాలు చెబుతున్న నేపథ్యంలో ఈ అంశాలు విచారణలో కీలకంగా మారనున్నాయి. కమిటీ 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిలో కొందరికి 90% వరకు కాలిన గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్కు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఘటనకు గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రస్తుతం మంత్రి నా లోకేష్ ఆసుపత్రికి చేరుకొన్నారు.
youtube.com/watch?v=GBA2yUTUXtc&feature=youtu.be

