ఇటీవల తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తప్పుపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. ఆమె బీఆర్ఎస్కు మద్దతుగా మాట్లాడారని.. మళ్లీ విజయశాంతి పార్టీమారుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. దీనిపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎలా ఉంటాయో… గత, ఇప్పటి పరిస్థితులను ఉదహరించి తాను ట్వీట్ చేసినట్లు తెలిపారు. దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను నిన్నటి పోస్టులో వ్యక్తపరిచానన్నారు. కానీ అవగాహన చేసుకునే తత్వంలేని కొందరు ఆ పోస్టుపై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా కథనాలు వారే రాసి వ్యాఖ్యానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత కల్పన అల్లారని విమర్శించారు. అయినా, అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలమని… కాని ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్నవాళ్లకు వివరణలు ఇచ్చినా ప్రయోజనం ఉండదన్నారు.