Vijayasai Reddy vs Purandeswari: పురంధేశ్వరికి సాయిరెడ్డి కౌంటర్‌.. ‘జాతీయ నేత’గా ఉండి ‘జాతి నేత’గా ఎందుకు మారారు?

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy vs Purandeswari: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. తీరికి దొరికితే చాలు ట్వీట్‌ పెడతాను అనే విధంగా.. వరుసగా ట్వీట్లతో పురంధేశ్వరిపై విరుచుకుపడుతున్నారు.. తాజాగా చేసిన ట్వీట్ల విషయానికి వెళ్తే.. ”చెల్లీ! చిన్నమ్మా పురందేశ్వరి! మీరు ‘జాతీయ నేత’గా ఉండి ‘జాతి నేత’గా ఎందుకు మారారు? అంటూ ప్రశ్నించారు సాయిరెడ్డి.. మీ సొంత ఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో మీరు ఇప్పుడున్న పార్టీ బీజేపీ నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా మీ సొంత మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను ఎందుకు పోటీ పెట్టలేదు? అప్పటికి మీరు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కదా! రాష్ట్రంలో మీ పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ చేశారు. మరి మీరెందుకు ఆ పని చేయలేదు? అంటూ నిలదీశారు.

Read Also: LB Nagar Politics: ప్రచారంపై ప్రత్యేక దృష్టి.. సభలు, రోడ్‌షోలతో హోరెత్తుతున్న ఎల్‌బి నగర్..

మీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెబుతారు? అంటూ పురంధేశ్వరిని నిలదీశారు సాయిరెడ్డి.. కొంపదీసి ‘మా బావ కళ్లల్లో ఆనందం కోసం’ అని నిజం చెబుతారా? అని ఎద్దేవా చేశారు. ఇదే కదా మీకు బీజేపీ పట్ల ఉన్న చిత్తశుద్ధి! వెనకటికి ఒకామె.. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అన్నదట! అంటూ పురందేశ్వరిపై సెటైర్లు వేశారు. ఇక, మరో ట్వీట్‌లోకి వెళ్తే.. ”కారంచేడు 145వ పోలింగ్ బూత్ లో బీజీపీకి పడిన 6 ఓట్లలో అసలు పురంధేశ్వరి ఓటు ఉందా? మీ సొంత బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా? మీ బావ పక్షాన పక్షపాతివై ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీకు కంటగింపు అయిపోయింది. బీజేపీ లాంటి సిద్ధాంతం ఉన్న పార్టీలో సిద్ధాంతాలు గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారు? గట్టిగా మాట్లాడితే మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనో ఉండిపోయింది అని బొంకుతారు మళ్లీ..! అంటూ మరో ట్వీట్‌లో ఫైర్‌ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇక, తన ట్వీట్లకు కారంచేడులో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లకు సంబంధించిన లిస్ట్‌ను కూడా జత చేశాడు విజయసాయిరెడ్డి.