Vijay TVK Plan B: విజయ్ నేతృత్వంలోని టీవీకేలో తాజా రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాల ముందు పార్టీ అధినేత విజయ్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సమావేశంలో గెలిచిన వెంటనే పార్టీ హెడ్క్వార్టర్స్కు రావాలని అభ్యర్థులకు సూచించిన విజయ్, ఇప్పుడు మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్లాన్-బీ అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. టీవీకేకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ రావడంతో పార్టీ కీలక నేతలు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో కార్యదర్శి ఆదవ్ ఆర్జున, మాజీ మంత్రి సేంగోటియన్లతో కలిసి వ్యూహరచన చేస్తున్నారు. తమిళనాడులో హంగ్ పరిస్థితి ఏర్పడే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ సూచించడంతో, అభ్యర్థులు చెదరిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మహాబలిపురంలో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. కౌంటింగ్కు ఒక రోజు ముందుగానే రిసార్ట్ బుక్ చేసిన విజయ్, గెలిచిన అభ్యర్థులు నేరుగా పూంజేరి రిసార్ట్కు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టీవీకే అభ్యర్థులు ఇతర పార్టీల ప్రభావానికి లోనుకాకుండా కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
ఇక రేపు(సోమవారం) పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతోపాటు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఫలితాల ద్వారా కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్ల భవితవ్యం తేలనుంది. గతానికి భిన్నంగా ఆయా రాష్ట్రాల్లో ఈసారి భారీగా పోలింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ మిశ్రమ ఫలితాలను అందించడంతో ఈ రాష్ట్రాల్లో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
