Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..

Vijay Antony

Vijay Antony

సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఆయన.. తాజాగా శశి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘నూరుసామి’ (తెలుగులో ‘వంద దేవుళ్లు’) ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా విజయ్ ఆంటోనీ తన వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

తాను రాబోయే రెండు మూడేళ్లలో చిత్ర పరిశ్రమను, అలాగే చెన్నై మహానగరాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఒక పల్లెటూరిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. రంగుల ప్రపంచం కంటే ప్రశాంతమైన సాధారణ జీవితం గడపడంపైనే తనకు ఎక్కువ ఆసక్తి ఉందని, కేవలం వృత్తిపరమైన కారణాల వల్లే ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నానని తెలిపారు. జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెన్కాసికి మారినట్లే, తాను కూడా పోల్లాచి వంటి ప్రశాంతమైన ప్రాంతంలో స్థిరపడాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే మారుమూల గ్రామాల్లో వ్యవసాయ భూమి కొనుగోలు చేసేందుకు అన్వేషిస్తున్నట్లు, ‘నూరుసామి’ షూటింగ్ జరిగిన కల్లకురిచ్చి వాతావరణం తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నారు.

×
×
Ad

నగరాల్లోని మాల్స్, ఆడంబరాల కంటే పల్లెటూరిలోని స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ప్రశాంతత ఎంతో గొప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, మూడేళ్ల క్రితం కూతురి ఆకస్మిక మరణం విజయ్ ఆంటోనీని మానసికంగా తీవ్రంగా కుంగదీసింది. ఈ వ్యక్తిగత విషాదం తర్వాతే ఆయన సినిమాల వేగాన్ని తగ్గించారు. వెండితెరపై ఎంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ, జీవితంలో మానసిక ప్రశాంతత, సంతోషమే ముఖ్యమని గ్రహించి ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసి, ఆ తర్వాత శాశ్వతంగా చిత్రసీమకు దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఈ నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నా, మరోవైపు ఆయన ‘అప్పా కుట్టి’ అనే సరికొత్త ఎమోషనల్ డ్రామా సినిమాను కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే రాబోతున్న ‘నూరుసామి’ చిత్రం ఒక యదార్థ సంఘటన ఆధారంగా, రక్తం, చెమట, బంధాల నేపథ్యంలో సాగే ప్రయాణంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో స్వాసిక కథానాయికగా నటించగా, లిజోమోల్ జోస్, అజయ్ ధీషన్ కీలక పాత్రలు పోషించారు.