Vande Mataram Amendment Bill 2026: జాతీయ గీతం ‘జనగణమన’ లేదా మువ్వన్నెల జెండాను అవమానిస్తే ఎంతటి కఠిన శిక్ష పడుతుందో మనందరికీ తెలిసిందే. త్వరలోనే మన జాతీయ గేయం ‘వందేమాతరం’ విషయంలోనూ ఇదే విధమైన చట్టం రాబోతోంది. వందేమాతరం ఆలపించకుండా అడ్డుకున్నా లేదా దాన్ని అవమానించినా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త బిల్లును తీసుకువస్తోంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 1971 నాటి ‘జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టం’కి సవరణలు చేస్తూ ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ (అమెండ్మెంట్) బిల్లును తీసుకురానున్నారు. దీని ద్వారా జాతీయ గీతం, రాజ్యాంగం, జాతీయ జెండాతో సమానంగా వందేమాతరానికి కూడా పూర్తి చట్టపరమైన రక్షణ లభిస్తుంది.
వందేమాతరం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ ఏడాది పొడుగునా ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ గేయానికి మరింత ప్రాధాన్యత కల్పించేలా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ గీతాన్ని ఆలపించే అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరాన్ని కూడా తప్పనిసరిగా పాడాలని స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావించారు. ఈ పాటను బెంగాలీ నవలా రచయిత బంకిం చంద్ర ఛటోపాధ్యాయ 1875లో రాయగా, 1882లో ఆయన రాసిన ‘ఆనందమఠ్’ నవలలో ఇది ప్రచురితమైంది. సరిగ్గా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఉత్తర్వులు రావడం రాజకీయ దుమారం రేపింది. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి, అక్కడ తొలిసారి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. తాజాగా హోంశాఖ రాష్ట్రాలకు మరో లేఖ రాస్తూ.. అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గీతం కంటే ముందే జాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించాలని, పైగా వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను (సుమారు 3 నిమిషాల 10 సెకన్ల పాటు) పూర్తిగా పాడాలని ఆదేశించింది.
వందేమాతరంలోని అన్ని చరణాలను పూర్తిగా పాడాలన్న ఈ నిర్ణయం వెనుక ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. 1937లో జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని నిర్ణయించింది. ఈ పాటలోని తర్వాతి చరణాల్లో హిందూ దేవతల ప్రస్తావన ఉండటం పట్ల ముస్లిం వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడమే ఇందుకు కారణం. ఈ చారిత్రక అంశాన్ని అస్త్రంగా చేసుకుని బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ మీద విమర్శల దాడికి దిగుతోంది. కాంగ్రెస్కు వందేమాతరం అంటేనే ద్వేషమని బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా తీవ్ర ఆరోపణలు చేశారు. ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి నెహ్రూ ఈ జాతీయ గేయాన్ని రెండు ముక్కలు చేశారని, కేవలం రెండు చరణాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు దాన్ని పాడటానికి నిరాకరించేవారని ఆయన విమర్శించారు.

