Vaibhav Sooryavanshi: రెండు వారాల క్రితం అహ్మదాబాద్లో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ భుజంపై చేయి వేసి, అతడి కెరీర్కు ఎంతో ఉపయోగపడే ఒక అమూల్యమైన సలహా ఇచ్చాడు. “ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారనే విషయాలను అస్సలు పట్టించుకోకు” అని కోహ్లీ చెప్పిన మాటలను వైభవ్ తన గుండెల్లో దాచుకున్నాడు. అది ఒక కలలా అనిపించిందని, కోహ్లీ ఒక అన్నలా వచ్చి మాట్లాడారని వైభవ్ తర్వాత చెప్పుకొచ్చాడు. కానీ, లంక వేదికగా దంబుల్లాలో శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో మాత్రం వైభవ్ ఆ మాటలను కాస్త పక్కనబెట్టినట్లు కనిపించాడు. సూపర్ ఓవర్లో భారత్ ఓడిపోయిన బాధలో తలదించుకుని వెళ్తున్న వైభవ్ను.. లంక ఫీల్డర్ విషేన్ హలంబాగే ఏదో అనడంతో ఆగ్రహానికి గురైన వైభవ్ ఎడమచేత్తో నెట్టేశాడు. కేవలం కొన్ని సెకన్ల పాటు జరిగిన ఈ భౌతిక ఘర్షణ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది.
నిజానికి ఆ మ్యాచ్ మొదటి నుంచి ఆసక్తికరంగా సాగింది. ఇరు జట్లు 265 పరుగుల వద్ద టై కావడం, ఆఖరి బంతికి నో-బాల్ వివాదం తలెత్తడం, కెప్టెన్ తిలక్ వర్మ అంపైర్లతో వాదించడం.. ఇలా సూపర్ ఓవర్ ముగిసేసరికి ఇరు జట్ల ఆటగాళ్ల నరాలు తెగేంత ఒత్తిడి నెలకొంది. సూపర్ ఓవర్లో వైభవ్ రెండు బంతుల్లో 5 పరుగులు చేసినా భారత్కు ఓటమి తప్పలేదు. మ్యాచ్ ముగిశాక లంక ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, హలంబాగే చేసిన వ్యాఖ్యలతో వైభవ్ సహనం కోల్పోయాడు. లంక సీనియర్ ప్లేయర్ నిరోషన్ డిక్వెల్లా, కెప్టెన్ సహన్ అరాచ్చిగే వెంటనే జోక్యం చేసుకుని ఇరు ఆటగాళ్లను విడదీయడంతో గొడవ సర్దుమణిగింది. అయితే, వైభవ్ మైదానంలో ఇలా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత డిసెంబర్ 2025లో దుబాయ్లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో పాక్ పేసర్ అలీ రజా తనను అవుట్ చేసి ఏదో అనడంతో వైభవ్ వెనక్కి తిరిగి సైగలు చేస్తూ దీటుగా బదులిచ్చాడు. ఆ వీడియో కూడా అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈ రెండు సంఘటనలను చూసి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని ఒక ‘ఆంగ్రీ యంగ్ మేన్’ గా ముద్ర వేయలేం. మైదానం వెలుపల వైభవ్ ఎంతో వినయపూర్వకంగా ఉంటాడు. ఐపీఎల్ 2026లో సునీల్ గవాస్కర్ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవడం, కోహ్లీ చేత రాజస్థాన్ రాయల్స్ క్యాప్పై సంతకం చేయించుకుని ఆరెంజ్ క్యాప్ లేనప్పుడల్లా దానిని ధరించడం మనం చూశాం. గవాస్కర్కు మొక్కే కుర్రాడు, లంక ప్లేయర్ను నెట్టిన కుర్రాడు ఇద్దరూ ఒక్కరే. 15 ఏళ్ల వయసులో మైదానంలో ఎదురయ్యే స్లెడ్జింగ్కు ఎలా స్పందించాలో నేర్చుకునే ప్రక్రియలో అతను ఉన్నాడంతే. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు అహ్మదాబాద్లో వైభవ్కు హితబోధ చేసిన విరాట్ కోహ్లీ కూడా కెరీర్ ఆరంభంలో ఇలాగే ఉండేవాడు. కోపం, దూకుడు, ప్రత్యర్థులపై విరుచుకుపడటం కోహ్లీకి అలవాటుగా ఉండేది. కోచ్లు, క్రికెట్ బోర్డులు వారించాల్సి వచ్చేది. కానీ కాలక్రమేణా కోహ్లీ ఆ కోపాన్ని, ఫైర్ను వృథా చేయకుండా తన బ్యాటింగ్పై, ఫిట్నెస్పై మళ్లించాడు. అదే అతడిని ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్గా మార్చింది. టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కథ కూడా ఇంతే. ఈరోజు టెన్నిస్లో అత్యంత హుందాగా ఆడే ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఫెదరర్, టీనేజ్లో రాకెట్లను పగులగొడుతూ, అంపైర్లపై అరుస్తూ కోపానికి మారుపేరుగా ఉండేవాడు. ఆ తర్వాతే ఆ ఎనర్జీని ఎలా మళ్లించాలో అతను నేర్చుకున్నాడు. అలాగే వైభవ్ కూడా అన్నింటిని అర్థం చేసుకుని మంచి ప్లేయర్గా ఎదుగుతాడని ఆశిద్దాం..

