Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్లోని చివరి మ్యాచ్ ఈరోజు (జూన్ 21) ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ దంబుల్లాలోని రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో కొనసాగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక ‘ఎ’ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్లో బుడ్డోడు శ్రీలంకపై ప్రతీకారం తీర్చుకున్నాడు. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. లీగ్ మ్యాచ్లో సూపర్ ఓవర్ ఓటమి తర్వాత, శ్రీలంక ‘ఎ’ ఆటగాళ్లు వైభవ్ను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. ఆ కోపాన్నంతా బ్యాట్ ద్వారా చూపిస్తూ ఫైనల్లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది తన సత్తా నిరూపించుకున్నాడు. ఐదు సిక్సర్లు, ఐదు ఫోర్లతో దంబుల్లా స్టేడియం నలుమూలలా బంతిని పరుగెత్తించాడు. కట్ షాట్స్, పుల్ షాట్స్, కళ్లు చెదిరే డ్రైవ్లతో లంక బౌలింగ్ లైనప్తో ఆడుకున్నాడు. కెప్టెన్ తిలక్ వర్మ తనపై ఉంచిన నమ్మకాన్ని, ఇచ్చిన స్వేచ్ఛను వందకు వంద శాతం నిజం చేస్తూ “బేబీ బాస్” రేంజ్ ఏంటో ఫైనల్ లాంటి హై-ప్రెజర్ మ్యాచ్లో చేసి చూపించాడు. కానీ.. చివరి నిమిషంలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అంటే దాదాపు 324 స్ట్రైక్ రేట్తో లంక బౌలర్లను ఉతికేసాడు. శ్రీలంక కెప్టెన్ సహన్ అరాచ్చిగే వేసిన స్పిన్ బంతిని మిడ్-ఆఫ్ మీదుగా బౌండరీ దాటించాలనే ప్రయత్నంలో వైభవ్ మిస్టైమ్ చేసి విజయకాంత్ చేతికి చిక్కాడు. లంక ఫీల్డర్ ఆ క్యాచ్ పట్టగానే ఆ జట్టు ప్లేయర్స్ అందరూ ఎంతగా ఊపిరి పీల్చుకున్నారో వారి ముఖాల్లోనే స్పష్టంగా కనిపించింది. ఆ రేంజ్ భయాన్ని ఒంటిచేత్తో సృష్టించాడు ఈ ‘బేబీ బాస్’. మాటలతో కాకుండా చేతలతోనే సమాధానం చెప్పాలనే సామెతను వైభవ్ నిజం చేశాడు. తన ప్రవర్తనను విమర్శించిన వారికి ఈ ఇన్నింగ్స్తో నోళ్లు మూయించేశాడు.
మరోవైపు.. పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన భారత జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. మరోవైపు, శ్రీలంక జట్టు ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్టు రెండు పాయింట్లతో టైటిల్ పోరుకు అర్హత సాధించడంలో విఫలమైంది. ప్రస్తుత టోర్నమెంట్లో భారత్ ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్లు తలపడటం ఇది మూడోసారి. వారి మధ్య జరిగిన గత రెండు మ్యాచ్లు 1-1 స్కోర్తో ముగిశాయి. ప్రస్తుతం మ్యాచ్ను సైతం భారత్ చేజిక్కించునేలా కనిపిస్తోంది!

