Vaibhav Sooryavanshi: ట్రై-సిరీస్లోని చివరి మ్యాచ్ ఇండియా ‘ఎ’, శ్రీలంక ‘ఎ’ జట్ల మధ్య జరుగుతోంది. రంగిరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న త్రైపాక్షిక సిరీస్ (Tri-Nation Series)లో వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయాడు. కేవలం 29 బంతుల్లో 94 పరుగులు సాధించాడు. 10 ఫోర్లు, 8 సిక్సర్లతో శ్రీలంక ఏ టీమ్ ప్లేయర్స్కి చుక్కలు చూయించాడు. దాదాపు 324 స్ట్రైక్ రేట్తో లంక బౌలర్లను ఉతికేసాడు. కానీ.. సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఏది ఏమైతేనేం.. కెప్టెన్ తిలక్ వర్మ నమ్మకాన్ని ఈ బుడ్డోడు నిలబెట్టుకున్నాడు. మ్యాచ్కు ముందు ‘స్పోర్ట్స్టార్’ ఇంటర్వ్యూలో తిలక్ మాట్లాడుతూ.. కెప్టెన్గా తాను ఎల్లప్పుడూ వైభవ్కు తోడుగా ఉంటానని స్పష్టం చేశాడు. “వైభవ్ తన సహజమైన ఆటను కొనసాగించాలని, ఒత్తిడి తీసుకోకుండా ఆటను ఆస్వాదించాలని నేను అతనికి చెప్పాను. ఈ వయసులోనే అతను కొత్త విషయాలు నేర్చుకోవాలి, తన ప్రతిభను ప్రపంచానికి చూపించాలి. ఇప్పటివరకు అతను సాధించిన విజయాలన్నీ సానుకూల (పాజిటివ్) దృక్పథంతో ఆడటం వల్లే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఆ శైలిని మార్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదు” అని తిలక్ స్పష్టం చేశాడు. ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఖచ్చితంగా రాణిస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. వైభవ్ క్రీజులో సెట్ అయితే ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల సామర్థ్యం అతనికి ఉందని ప్రశంసించాడు. తిలక్ చెప్పిన విధంగానే వైభవ్ భారీ స్కోర్ సాధించడం కెప్టెన్గా గర్వకారణం.
ఇక, శ్రీలంకతో జరిగిన ఈ టైటిల్ పోరులో వైభవ్ కేవలం 11 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్కును అందుకోవడం విశేషం. ఈ ఇన్నింగ్స్లో వైభవ్ 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు. విశేషం ఏంటంటే, ఇందులో సింగిల్స్ కానీ, డబుల్స్ కానీ తీసి ఒక్క రన్ కూడా పరిగెత్తలేదు. కొట్టిన ఆ పది బౌండరీల ద్వారానే 50 పరుగులు వచ్చేశాయి. కేవలం ఒక్క బంతి మాత్రమే డాట్ కాగా, ఈ ఇన్నింగ్స్ మొత్తంలో అతని స్ట్రైక్ రేట్ 450 కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు.. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో అత్యంత వేగంగా అర్ధశతకం సాధించిన బ్యాట్స్మన్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. శ్రీలంకకు చెందిన కౌశల్య వీరరత్నే 20 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. 2005 నవంబర్ 1న, రాగమ క్రికెట్ క్లబ్ తరఫున కురునెగాల యూత్ క్రికెట్ క్లబ్పై ఆడుతూ, అతను కేవలం 12 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. సర్ఫరాజ్ ఖాన్ నెలకొల్పిన భారత రికార్డును సైతం వైభవ్ అధిగమించాడు. గత విజయ్ హజరే ట్రోఫీ సీజన్లో పంజాబ్పై ముంబై తరఫున సర్ఫరాజ్ కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు.

