US-Iran శాంతి ఒప్పందం.! పెట్రోల్ నుంచి హోం లోన్ వరకు.. భారతీయులకు ఎలాంటి ప్రభావం పడనుందంటే.!

Us Iran Peace Deal India

Us Iran Peace Deal India

US-Iran Peace Deal: అమెరికా, ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందం ఒక సాధారణ దౌత్య పరిణామంలా కనిపించినా.. దాని ప్రభావం ప్రపంచంలోని ప్రతి వ్యక్తిపై, ముఖ్యంగా భారతీయుల రోజువారీ జీవితంపై దీని ప్రభావం మరింతగా ఉండనుంది. వంటగ్యాస్ ధరల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు, విమాన టికెట్ల ఖర్చులు, ఆహార ధరలు, హోం లోన్ ఈఎంఐల వరకు అనేక అంశాలపై ఈ ఒప్పందం సానుకూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపాదిత ఒప్పందంలో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, అణు చర్చల పునఃప్రారంభం వంటి కీలక అంశాలు ఉన్నాయి. ఈ వార్తలతో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు 4%కి పైగా తగ్గాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా.?

ఈ ఒప్పందం వల్ల అత్యధికంగా లబ్ధి పొందే వారు వాహనదారులే. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% కి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. అందులో ఎక్కువ భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. అందులో అధికభాగం హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అవుతుంది. ప్రపంచ చమురు వ్యాపారంలో దాదాపు 20% ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడంతో పాటు దిగుమతి వ్యయం కూడా పెరిగింది. అయితే హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడం, ఇరాన్ చమురు ఎగుమతులు పునరుద్ధరించే అవకాశం ఉండటంతో మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశముంది. దీంతో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ఒత్తిడి తగ్గవచ్చు.

×
×
Ad

విమాన ప్రయాణాలు చౌకగా.?

విమానయాన సంస్థలకు ఇంధన వ్యయం అత్యంత కీలక ఖర్చులలో ఒకటి. ముడి చమురు ధరలు తగ్గితే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ATF) ధరలు కూడా తగ్గుతాయి. దీంతో విమానయాన సంస్థలు టికెట్ ధరలను తగ్గించడం లేదా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించే అవకాశం ఉంటుంది. దేశీయ విమాన ప్రయాణాలు వేగంగా పెరుగుతున్న ఈ సమయంలో, గల్ఫ్ దేశాలకు ప్రయాణించే భారతీయులు, యూరప్ మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇది శుభవార్తగా మారవచ్చు.

ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం:

చమురు ధరలు తగ్గడం వల్ల కేవలం ఇంధన ఖర్చులే కాదు.. ఆహార పదార్థాల ధరలపై కూడా ప్రభావం పడుతుంది. కూరగాయలు, పండ్లు రవాణా చేసే ట్రక్కులు, వ్యవసాయ యంత్రాలు, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు ప్రధానంగా డీజిల్‌పై ఆధారపడుతాయి. అదేవిధంగా గల్ఫ్ దేశాలు యూరియా వంటి ఎరువుల ప్రధాన ఎగుమతిదారులు కావడంతో హోర్ముజ్ సంక్షోభం ఎరువుల మార్కెట్‌పైనా ప్రభావం చూపింది. రవాణా, ఉత్పత్తి ఖర్చులు తగ్గితే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరల్లో కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.

ఎల్పీజీ సిలిండర్ల ధరలు:

భారత్ ఇప్పటికీ గృహ వినియోగ ఇంధన అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. హోర్ముజ్ జలసంధి సాధారణ స్థితికి రావడం, ఇరాన్ నుంచి చమురు సరఫరా పెరగడం వల్ల ఎల్పీజీ, సహజవాయువు మార్కెట్లపై ఒత్తిడి తగ్గవచ్చు. దాడుల సమయంలో పెరిగిన షిప్పింగ్ ఖర్చులు, బీమా ప్రీమియంలు తగ్గే అవకాశం ఉండటంతో దిగుమతి వ్యయం కూడా తగ్గుతుంది. దీంతో ప్రభుత్వం ఎల్పీజీ ధరలను స్థిరంగా ఉంచేందుకు మరింత అవకాశం లభించవచ్చు.

హోం లోన్లు, కార్ లోన్లు చౌక.?

ఈ ఒప్పందం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు. చమురు ధరలు తగ్గితే రవాణా, తయారీ, ఆహార రంగాల్లో ఖర్చులు తగ్గి ద్రవ్యోల్బణం నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ద్రవ్యోల్బణం తగ్గితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వడ్డీ రేట్లపై సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీంతో భవిష్యత్తులో హోం లోన్లు, కార్ లోన్లు, వ్యాపార రుణాలపై వడ్డీ భారం తగ్గే అవకాశం ఉంది.

భారత్‌కు ఎందుకు కీలకం.?

భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 60% ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా హోర్ముజ్ జలసంధి మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ మార్గం మూసివేయబడితే చమురు సరఫరా అంతరాయం, ద్రవ్యోల్బణం పెరుగుదల, ప్రస్తుత ఖాతా లోటు వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే అమెరికా, ఇరాన్ మధ్య కుదరనున్న ఈ శాంతి ఒప్పందం కేవలం ఒక దౌత్య విజయం మాత్రమే కాదు. ఇది భారతదేశానికి చౌకైన ఇంధనం, తగ్గిన ద్రవ్యోల్బణం, తక్కువ రవాణా వ్యయం, మరింత ఆర్థిక స్థిరత్వాన్ని అందించే అవకాశంగా కూడా కనిపిస్తోంది. భారతీయుల వంటగది నుంచి బ్యాంకు రుణాల వరకు ఈ ఒప్పందం ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.