US China Tensions: ప్రపంచంలోని రెండు అతిపెద్ద శక్తులైన అమెరికా, చైనాలు సముద్రంలో ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ ఘర్షణలు ప్రపంచ వాణిజ్యానికి, సరఫరా గొలుసులకు కొత్త ముప్పును కలిగిస్తున్నాయి. పనామా జెండా ఉన్న నౌకల కారణంగా ఈ తాజా వివాదం తలెత్తింది. చైనా తన ఓడరేవుల్లో పనామా జెండా ఉన్న నౌకలను కావాలనే అడ్డుకుంటోందని, దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి విఘాతం కలుగుతోందని అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ అంశంపై స్పందించారు. చైనా వేధింపు లేదా ఒత్తిడి వ్యూహంగా ఈ పరిస్థితిని అభివర్ణించారు. చైనా చర్య ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగిస్తోందని, ఖర్చులను పెంచుతోందని, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.
అమెరికాకు చెందిన ఓ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది మార్చి నెలలో చైనా ఓడరేవుల్లో తనిఖీల పేరుతో నిలిపివేసిన 124 నౌకల్లో, ఏకంగా 92 నౌకలు పనామా జెండా కలిగినవే. అంటే దాదాపు 75 శాతం ఓడలు పనామాకు చెందినవే కావడం గమనార్హం. ఈ నౌకలను ఒక్క రోజు నుంచి పది రోజుల వరకు నిలిపివేస్తుండటంతో రవాణా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఈ గొడవకు ప్రధాన కేంద్రం ప్రపంచ ప్రసిద్ధ పనామా కాలువ (Panama Canal). ఈ కాలువ ద్వారానే ప్రపంచ వాణిజ్యంలో మెజారిటీ భాగం జరుగుతుంది. ఇటీవల పనామా సుప్రీంకోర్టు హాంకాంగ్ ఆధారిత కంపెనీ నియంత్రణలో ఉన్న రెండు పెద్ద పోర్ట్ టెర్మినల్స్ ఒప్పందాన్ని రద్దు చేసి, వాటిపై తిరిగి పనామా ప్రభుత్వం నియంత్రణ సాధించింది. దీనిని చైనా జీర్ణించుకోలేకపోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
READ MORE: Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై ఇప్పటికే స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలకు చైనా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. “మేము ఇప్పటికే పనామా కాలువపై పట్టును పెంచుకుంటున్నాం. అవసరమైతే తిరిగి నియంత్రణ సాధిస్తాం.” అని ట్రంప్ పేర్కొన్నారు. దీనికి కౌంటర్గా చైనా రాయబార కార్యాలయ ప్రతినిధులు స్పందిస్తూ.. “అమెరికానే పనామా కాలువను ఆక్రమించుకోవాలని చూస్తోంది. తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది.” అని మండిపడ్డారు. అమెరికా చర్యలను చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. ఈ రెండు అగ్రరాజ్యాల పోరులో పనామా ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఒకవైపు చైనాతో గౌరవప్రదమైన సంబంధాలు కోరుకుంటూనే, నౌకల నిలిపివేత పెరుగుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రి అంగీకరించారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఓడల రిజిస్ట్రేషన్ కేంద్రంగా ఉన్న పనామాకు దీనివల్ల ఏటా సుమారు 100 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. ఒకవేళ చైనా ఇలాగే పనామా నౌకలను టార్గెట్ చేస్తే, ఆ దేశ షిప్పింగ్ ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.