Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!

Uravakonda Theft

Uravakonda Theft

అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేయడానికి దుకాణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. ముందుగా అక్కడ ఉన్న వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి నమస్కరించాడు. అనంతరం ఏమీ జరగనట్టుగా కుర్చీలో కూర్చొని నగదు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బిగ్ బజార్ దుకాణంలో గత నెల 31న రాత్రి చోరీ జరిగింది. షట్టర్‌ను ధ్వంసం చేసిన దొంగ లోపలికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని చూసిన అతడు.. ముందుగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కుర్చీలో దర్జాగా కూర్చొని.. నగదు తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దొంగ క్యాష్ కౌంటర్ నుంచి సుమారు రూ.30 వేల నగదుతో పాటు మరికొన్ని వస్తువులను ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని తెలిపాడు. దొంగతనం ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

సాధారణంగా దొంగతనానికి వచ్చిన వ్యక్తులు తొందరగా నగదు, విలువైన వస్తువులు తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంటారు. కానీ ఈ ఘటనలో దొంగ ముందుగా దేవుడి చిత్రపటానికి నమస్కరించి.. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా దొంగతనానికి పాల్పడటం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.