Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!

Upi Bill

Upi Bill

Digital Payments: యూపీఐ లావాదేవీలపై పన్నుల మోత పడనుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట మర్చంట్ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (ఎండీఆర్‌) విధించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్ణయించిన సంగతి విధితమే. ఈ నిర్ణయం వెలువడినప్పటి నుంచి కేంద్రంపై తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. అసలు ఐదేళ్ల క్రితమే డిజిటల్ మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఈ రుసుములు అమలు చేయాలని భావించామని, ఇది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని తేల్చిచెప్పాయి.

సాధారణ ప్రజలు, వినియోగదారులు ఈ నిర్ణయం పట్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. వ్యక్తుల మధ్య జరిగే (P2P) లావాదేవీలు ఎంత మొత్తంలో ఉన్నప్పటికీ రూపాయి కూడా ఛార్జ్ పడదని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేశాయి. అలాగే రోజువారీ షాపింగ్స్, చిన్న వ్యాపారులకు చేసే చెల్లింపులు, రూ.2,000 లోపు ఉండే మర్చంట్ (P2M) లావాదేవీలపై ఎలాంటి రుసుములు ఉండవని స్పష్టం చేసింది. నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా పేమెంట్లు పొందే చిన్న వ్యాపారులకు కూడా ఈ నిర్ణయం నుంచి పూర్తి మినహాయింపు ఉందని తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. దేశంలో జరిగే మొత్తం P2M లావాదేవీల్లో దాదాపు 96 శాతం లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు పడవు. కేవలం మిగిలిన 4 శాతం పెద్ద మర్చంట్ లావాదేవీలపై మాత్రమే ఈ ఎండీఆర్‌ వర్తిస్తుంది. రూ.2,000 దాటిన సాధారణ మర్చంట్ చెల్లింపులపై 0.4 శాతం (ఉదాహరణకు రూ.2,001 లావాదేవీకి సుమారు రూ.8) ఛార్జ్ పడుతుంది. రైల్వేలు, టెలికాం, ఇన్సూరెన్స్, ఇంధన రంగానికి చెందిన చెల్లింపులకు రూ.5 ఫ్లాట్ రేటును నిర్ణయించారు. అయితే ఈ ఎండీఆర్ అనేది ప్రభుత్వం లేదా ఎన్‌పీసీఐ వసూలు చేసే పన్ను కాదని, బ్యాంకులు, యూపీఐ యాప్ నిర్వాహకులు, చెల్లింపుల రంగానికి చెందిన భాగస్వాములకు డిజిటల్ వ్యవస్థను నిర్వహించడానికి, విస్తరించడానికి ఉపయోగపడే రుసుమని స్పష్టత ఇచ్చారు.