UP: ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో వెళ్తున్న ఒక భారీ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి టోల్ బూత్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా ఎల్పీజీ లీక్ అయ్యింది. ఇక వెంటనే మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ భయానక ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ 24 సెకన్ల వీడియో దృశ్యాల ప్రకారం.. రెండు గ్యాస్ ట్యాంకర్లు టోల్ ప్లాజా వైపు వస్తుండగా, అందులో ఒక ట్యాంకర్ అకస్మాత్తుగా నియంత్రణ తప్పి డివైడర్ను ఢీకొంటూ నేరుగా టోల్ బూత్లోకి దూసుకెళ్లింది. వాహనం క్రాష్ అయిన వెంటనే ట్యాంకర్ నుంచి గ్యాస్ భారీగా లీక్ అయి, చూస్తుండగానే పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. క్షణాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఈ ప్రమాదంలో రేగిన మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ అగ్నికీలలు స్పష్టంగా కనిపించాయి.
ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ఒక పోలీసు అధికారి.. మంటలను అదుపు చేయడానికి జిల్లాలోని అన్ని ఫైర్ బ్రిగేడ్ యూనిట్లను, స్థానిక సివిల్ పోలీసు సిబ్బందిని వెంటనే రంగంలోకి దించినట్లు తెలిపారు. ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ ధర్మేంద్ర దూబే (40)తో పాటు టోల్ ప్లాజా ఉద్యోగి ఆలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు ధాటికి టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమించి ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రమాదం జరిగిన తర్వాత టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు, కాసేపటి వరకు వాహనాలను ఎలాంటి రుసుము (టోల్ ఛార్జీలు) లేకుండానే ఉచితంగా దాటనిచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని (Technical Team) ఏర్పాటు చేశారు.

