ViralVideo: గురువును దైవంగా భావించే దేశంలో, ఒక ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులను తన వ్యక్తిగత సేవలకు వాడుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సింది పోయి, విద్యార్థినుల చేత కాళ్లు పట్టించుకుంటున్న వీడియో బయటకు రావడంతో ఆ ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో వెలుగుచూసిన ఈ షాకింగ్ ఘటన విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
READ ALSO: Testosterone: పురుషుల ఆరోగ్య సీక్రెట్.. టెస్టోస్టిరాన్ పెంచే బెస్ట్ ఆహారాలు ఇవే!
అసలేం జరిగిందంటే..
చిత్రకూట్ జిల్లా నయా బజార్ ప్రాంతంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన వెలుగు చూసింది. వైరల్ అయిన 21 సెకన్ల వీడియోలో.. ప్రధానోపాధ్యాయురాలు మధు రాయ్ తరగతి గదిలోని నేలపై చాప వేసుకుని పడుకుని ఉంది. ఒక విద్యార్థిని ఆమె కాళ్లను మసాజ్ చేస్తూ కనిపిస్తుండగా, సదరు ఉపాధ్యాయురాలు మాత్రం దర్జాగా మొబైల్ ఫోన్ వాడుతూ సేద తీరుతోంది. ఈ వీడియో విద్యాశాఖలో కలకలం రేపడంతో, జిల్లా విద్యాధికారి (BSA) బి.కె.శర్మ తక్షణమే స్పందించారు. నగర విద్యాధికారి అతుల్ దత్ తివారీని విచారణకు ఆదేశించారు. ఆయన పాఠశాలను సందర్శించి, విద్యార్థులతో మాట్లాడి వారి వాంగ్మూలాలను రికార్డ్ చేశారు. వీడియోలో ఉన్నది నిజమేనని తేలడంతో, ఆ నివేదిక ఆధారంగా మధు రాయ్ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారలు ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులతో మసాజ్లు చేయించుకోవడం ఇదే మొదటిసారి కాదని, గత కొంతకాలంగా ఇదే సాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పిల్లలను చదువుకోనివ్వకుండా ఇలాంటి వ్యక్తిగత పనుల కోసం వాడుకుంటూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి క్రమశిక్షణారాహిత్య చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని ఉన్నతాధికారులు తెలిపారు.
READ ALSO: Ustaad Bhagat Singh: ఉగాదికి ‘ఉస్తాద్’ ఊచకోత.. డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్!