జనవరి 22న జరిగే అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఎదురుచూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుందని తెలిపారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు దివాళా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానం మరోసారి స్పష్టమైందని దుయ్యబట్టారు. రాముడి ప్రాణ ప్రతిష్ట రోజు అయోధ్యకు రాకపోవడం.. రాజకీయ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.
Read Also: Indigo Flight: ఇండిగో విమానంలో కుషన్ లేని సీటు.. ఎయిర్లైన్ పై ప్రయాణికుడు సీరియస్..!
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట రాజకీయ కార్యక్రమం కాదని కిషన్ రెడ్డి తెలిపారు. రాముడి యొక్క ఉనికినే కొట్టివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిష్కరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయ్యిందని దుయ్యబట్టారు. అటు.. పార్లమెంట్ సమావేశాలను, G 20 సమావేశాలను, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించారని తెలిపారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని అన్నారు. ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు జనవరి 22న అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టకు హాజరు అవుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
Read Also: Google: గూగుల్లో మరోసారి లేఆఫ్.. వందలాది మంది ఉద్యోగుల తొలగింపు..
మరోవైపు.. అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే.. సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏంటి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పి ఏంటి ?.. పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి ? అని ఫైర్ అయ్యారు. వారం రోజులు తర్వాత ఎవరి ఒత్తిడితో కేసులు పెట్టారు ? అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పారు. రాహుల్ యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాహుల్ గాంధీ తిరగాలనుకుంటే చైనా బార్డర్, పాకిస్థాన్ బార్డర్, గోవా బీచ్ లో తిరగమనండి.. ఎవరు వద్దన్నారు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.