Minister Kishan Reddy: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన ధార్మిక సమ్మేళనాల్లో మహా కుంభమేళా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహోత్సవం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా పరిగణించబడుతుంది. ప్రపంచం నలుమూలల నుండి కోట్ల సంఖ్యలో భక్తులు ఈ మహామేళాకు తరలి వస్తున్నారు. గంగ, యమునా, సరస్వతీ నదుల సంగమ స్థానంలో పుణ్యస్నానం ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందుతారనే విశ్వాసంతో భక్తజనం ఉత్సాహంగా పాల్గొంటారు.
Read Also: AP Cabinet: ఢిల్లీకి సీఎం.. ఏపీ కేబినెట్ భేటీ వాయిదా
ప్రయాగరాజ్ కుంభమేళా సందర్భంగా.. భారత కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కుంభమేళా మహోత్సవంలో స్నానం చేయడం ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది” అని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన కుంభమేళా, సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెబుతోందని ఆయన పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తులు కుంభమేళా సందర్భంగా స్నానం ఆచరిస్తూ తమ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవడం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల పెరుగుతున్న భక్తిభావానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు.
Read Also: Vijayawada Metro Project: స్పీడందుకున్న విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు..!
ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని, దేశ ప్రజలందరికీ సుఖశాంతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కుంభమేళా వంటి ధార్మిక ఉత్సవాలు భారతదేశ సాంస్కృతిక వైభవానికి ప్రతిబింబమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కుంభమేళా హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన సమాగమంగా ప్రసిద్ధి పొందింది. ఈ కుంభమేళాలో స్నానం చేయడం వలన పాప విమోచనం కలుగుతుందని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా 2025 మహా కుంభమేళా మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది.