బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. తొలి విడత మోడీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిందన్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్ఖితులు, పరిణామాలు, స్థానికంగా లభ్యమయ్యే ముడి ఇనుము నాణ్యతలపై కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిందని ఆయన అన్నారు. 200 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజం లభ్యమయ్యే అవకాశం ఉంటేనే ఉక్కు కర్మాగారం నెలకొల్పాలని, ముడి ఇనుప ఖనిజం నాణ్యత లేకపోవడంతో, తగినంత ఖనిజ నిక్షేపాలు కూడా లేకపోవటంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని కమిటీ పేర్కొందని ఆయన వెల్లడించారు.
2018 లోనే బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు లాభదాయకం కాదని, చెయ్యలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ప్రజలకు కేసీఆర్, కేటీఆర్లే వాగ్దానం చేశారని, ప్రజా సమస్యలు గాలికొదిలేసి, అధికార టీఆర్ఎస్ వీధి నాటకాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారంటూ ఆయన విమర్శించారు. “తెలంగాణ మోడల్” అని గొప్పగా చెప్పుకుంటూ, సగం రోజులు ప్రగతి భవన్ లో, సగం రోజులు ఫామ్ హౌస్ లో ఉంటున్న మీకు ఏం చూసి దేశ ప్రజలు స్వాగతం పలకాలి అని ఆయన ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం ధర్నాలు, నిరసనలు చేయాల్సిన అవసరం లేదని మరో కేసీఆర్ కుటుంబ సభ్యుడు అంటారని, రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కు కర్మాగారం నెలకొల్పి, 10 వేల మందికి ఉపాధి కలిపిస్తామని కేసిఆర్ వాగ్దానం చేశారన్నారు.
చేతనైతే, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఉక్కు కర్మాగారం కేసీఆర్ నెలకొల్పాలని, కల్వకుంట కుటుంబీకులు ఇష్టానుసారంగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారని, ఉన్న వాస్తవాలు చెబితే, నా దిష్టి బొమ్మలు ఎందుకు తగులబెట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూముల ఆక్రమణలు, గులాబీ దండు దోపిడీ లు పెచ్చుమీరిపోయాయని, భూవివాదాలకు సంబంధించి నాలుగు లక్షల దరఖాస్తులు దాఖలైతే, ప్రభుత్వం పరిష్కరించలేని అసమర్ధతతో ఉందని ఆయన ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున కేంద్ర అవార్డులు వచ్చాయని, కేసీఆర్ కుటుంబం నుంచి, అధికార టీఆర్ఎస్ నుంచి ప్రజలు తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కానీ మోడీ ప్రభుత్వం కానీ ఉక్కు కర్మాగారం పై ఏలాంటి హామీ ఇవ్వలేదని, హామీలు ఇచ్చి, వాగ్దానాలు చేసి తప్పించుకునే అలవాటు బీజేపీకి లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణను ఏం ఉద్ధరించామని, ఇప్పుడు జాతీయ పార్టీ అంటున్నారని, టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీ లు ప్రజాధనం దోచుకోవడం తప్పితే, చేసేదేమి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవింగ్ సీటులో మాత్రమే కేసిఆర్ కూర్చున్నారు. స్టీరింగ్, బ్రేకు, ఎక్సలరేటర్ మొత్తం మా చేతుల్లోనే ఉందని మీ మిత్ర పక్షం మజ్లీస్ నాయకుడే చెప్పారు. తెలంగాణను దోచుకుంది చాలక, ఇప్పుడు దేశం మీద పడి దోచుకునేందుకు ఊరేగే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేస్తూ మాట్లాడిన వీడియో క్లిప్పింగులను కేంద్ర మంత్రి ప్రదర్శించారు.