Bandi Sanjay Kumar: ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదు.. బీసీలకు అన్యాయం చేసింది..!

  • నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి?
  • మావోయిస్టులపై కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి రెండు నాల్కల ధోరణి
  • రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదు
  • కేవలం సర్వే మాత్రమే జరిపింది
  • బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది.
Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay Kumar: గోదావరి ఖనిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నక్సల్స్, కాంగ్రెస్ పార్టీ వైఖరి, కులగణన తదితర అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. నక్సల్స్ సానుభూతిపరులు హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటి? అంటూ ప్రశ్నించారు. వారు దశాబ్దాలుగా నక్సల్స్ పక్షాన నిలబడి, అమాయకుల చావులకు కారణమైన విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఆ చావులకు మీరు ఏమి సమాధానం చెబుతారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Addanki Dayakar: రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే ప్రధాన లక్ష్యం..!

అలాగే, మావోయిస్టులపై కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న దుర్బుద్ధి వైఖరి రెండు నాలుకల ధోరణికి నిదర్శనం. ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని చెప్పుకుంటూ, మరోవైపు తుపాకీతో అమాయకులను చంపుతున్న వారిని సమర్థించడం సరికాదని స్పష్టం చేశారు. తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే చర్చలేంటి? దశాబ్దాలుగా జరిగిన హత్యలు మర్చిపోయారా? మావోయిస్టులు తుపాకీ వదిలి లొంగిపోవాలి. ప్రజల మధ్య కలవాలని బండి సంజయ్ అన్నారు. అలాగే పౌర హక్కుల సంఘాలనూ ఉద్దేశించి, మీరు నిజంగా ప్రజల పక్షాన ఉంటే, నక్సల్స్ కు నచ్చజెప్పండి.. మార్గం తప్పకుండా సూచించండి అని వ్యాఖ్యానించారు.

Read Also: Nandamuri Balakrishna: బాలయ్య సీరియస్‌ వార్నింగ్‌.. వాళ్ల జోలికి వస్తే ఖబర్దార్..

కులగణన అంశంపై మాట్లాడిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం చేసింది కులగణన కానేకాదు.. కేవలం సర్వే మాత్రమే. బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది అని ధ్వజమెత్తారు. ప్రతి ఇంటికి వెళ్లి కచ్చితంగా నిర్వహించేది కులగణనే. రాష్ట్రం చేసినది అసంపూర్ణం. కానీ, మోడీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో జనగణన ప్రక్రియలో భాగంగా కులగణన చేస్తుంది. ఇది బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేలా ఉంటుంది అని తెలిపారు.