Udhayanidhi Stalin: తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అధినేతనే జనాలు ఘోరంగా ఓడగొట్టారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సైతం ఆ పార్టీని ఓడగొట్టడానికి ఓ కారణం. ఘోరపరాజయాన్ని చవిచూసినప్పటికీ.. ఉదయనిధి స్టాలిన్లో ఏ మాత్రం మార్పు రాలేదు. తమిళనాడు శాసనసభలో మంగళవారం చర్చాకార్యక్రమంలో ప్రతిపక్ష నేత, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ మరోసారి తన ‘సనాతన ధర్మ’ వ్యతిరేక గళాన్ని వి వినిపించారు. ప్రజల మధ్య విభజన తెచ్చే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న తన పాత నినాదాన్ని అసెంబ్లీ వేదికగా పునరుద్ఘాటించారు. “మనుషుల మధ్య దూరాన్ని పెంచే సనాతన ధర్మాన్ని అంతం చేయాల్సిందే” అని స్పష్టం చేశారు. అదే సమయంలో సభలో హుందాతనాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
రాజకీయ నాగరికత గురించి ప్రస్తావిస్తూ.. “నిన్న కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు మా నాయకుడితో పాటు ఇతర రాజకీయ నేతల నుంచి ఆయనకు శుభాకాంక్షలు అందాయి. అటువంటి రాజకీయ మర్యాదలు ఈ సభలోనూ కొనసాగాలి. మనం అధికార, ప్రతిపక్ష వరుసల్లో వేర్వేరుగా కూర్చున్నప్పటికీ, తమిళనాడు అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి” అని ఉదయనిధి పిలుపునిచ్చారు. సభలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు.
అయితే, సభలో తమిళనాడు రాష్ట్ర గీతానికి జరిగిన ప్రాధాన్యత విషయంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “వందేమాతరం తర్వాత మన రాష్ట్ర గీతాన్ని ఆలపించడంపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం గమనిస్తే అక్కడ వందేమాతరం ఆలపించలేదు. కానీ ఇక్కడ మాత్రం దాన్ని ప్లే చేశారు. అక్కడ గవర్నర్ ఎవరో మీకు తెలుసు. ఇలాంటివి మళ్ళీ జరగనివ్వకూడదు. మన తమిళనాడు రాష్ట్ర గీతం ఎప్పటికీ రెండో స్థానానికి పడిపోకూడదు” అని వ్యాఖ్యానించారు.
