Pakistan: మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పాకిస్థాన్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గల్ఫ్ దేశాల ఆర్థిక ముఖచిత్రం మారుతోంది. ఈ క్రమంలోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పాకిస్థాన్కు షాకిస్తూ, వాళ్లు ఇచ్చిన భారీ రుణాన్ని తక్షణమే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్పై ఇది పిడుగు లాంటి వార్తే. అయితే యూఏఈ మాత్రం తన నిధులను వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుండటంతో యూఈఏ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఇందులో భాగంగా పాకిస్థాన్ వద్ద డిపాజిట్ చేసిన 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 16,700 కోట్లు) రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాలని యూఏఈ పాకిస్థాన్కు అల్టిమేటం జారీ చేసింది.
READ ALSO: Maharashtra: నాసిక్లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి
ఇరాన్ పోరు కారణంగా సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో ఆయా దేశాల్లో అభద్రతా భావం నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ ఆర్థిక అవసరాల కోసం యూఏఈ.. పాకిస్థాన్ స్టేట్ బ్యాంక్ (SBP)లో భద్రపరిచిన డిపాజిట్లను వెనక్కి అడుగుతోంది. వాస్తవానికి ఈ నగదును పాక్ తన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి వాడుకుంటోంది. పాకిస్థాన్ ప్రసార సంస్థ ‘జియో న్యూస్’ కథనం ప్రకారం.. గతంలో యూఏఈ ఈ రుణ గడువును ప్రతి ఏటా పొడిగించేది. కానీ, 2025 డిసెంబర్ నుంచి కేవలం నెలవారీ ప్రాతిపదికన పొడిగిస్తూ వచ్చి, ఇప్పుడు ఏప్రిల్ 17 వరకు డెడ్ లైన్ విధించింది. ఈ లోపు మొత్తం 2 బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాలని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ ప్రస్తుతం ఈ మొత్తంపై దాదాపు 6 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
ప్రస్తుతానికి పాకిస్థాన్ వద్ద 21 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 బిలియన్ డాలర్లను చెల్లించే సామర్థ్యం పాక్కు ఉన్నప్పటికీ, అది జరిగిన వెంటనే విదేశీ నిల్వలు అట్టడుగుకు పడిపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ ఈ దేశం అప్పుల కోసం ఐఎంఎఫ్ (IMF) లేదా చైనా వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్కు దాదాపు 12 బిలియన్ డాలర్ల విదేశీ డిపాజిట్ల పునరుద్ధరణ అవసరం. ఇందులో సౌదీ ($5B), చైనా ($4B), యూఏఈ ($3B) వాటాలు ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గల్ఫ్ దేశాలు తమ నిధులను భద్రపరుచుకునే పనిలో పడ్డాయి. యూఏఈ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇతర దేశాలైన సౌదీ అరేబియాపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని, సౌదీ కూడా తమ అప్పులను వెనక్కి అడిగితే పాకిస్థాన్ పరిస్థితి ‘పెనం నుంచి పొయ్యిలో పడినట్లు’ మారుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!
