UAE Ambassador: ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర తరమవుతున్నాయి. మొదట ఈ మూడు దేశాలకే పరిమితమై ఘర్షణలు గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతార్, జోర్డాన్ వంటి దేశాలకు పాకాయి. దీంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కుదేలైంది. ముఖ్యంగా ఇంధన సరఫరాపై తీవ్రంగా ఎఫెక్ట్ పడింది. ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో యూఏఈ రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్కు ఉన్న దౌత్యపరమైన బలాన్ని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క ఫోన్ చేస్తే చాలు ఈ యుద్ధం ముగిసిపోతుందని.. సమస్యలన్నీ సర్దుమనుగుతాయని వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాల్లోని పాలకుల్లో మోడీపై అపారమైన గౌరవం ఉందని వెల్లడించారు. అక్కడి ప్రజలు సైతం ప్రధాని మోడీకి మర్యాద ఇస్తారన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విదేశాల్లో మోడీకి ఉన్న ప్రాధాన్యత, భారత్కు ఉన్న గౌరవం గురించి చర్చ మొదలైంది.
ఇక మరోవైపు.. గల్ఫ్ దేశాల్లో భారత్కు చెందిన అనేక మంది జీవిస్తున్నారు. వ్యాపారాలు, బతుకు దెరువు నిమిత్తం భారత్ నుంచి అక్కడికి వెళ్లారు. యుద్ధ వాతావరణం ముదరడంతో భారత్ అప్రమత్తమైంది. అక్కడున్న భారతీయులపై పరిస్థితిపై ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంపై ప్రధాని మోడీ ఇప్పటికే యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ఫోన్లో మాట్లాడారు. యూఏఈపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించిన మోడీ, ఈ క్లిష్ట సమయంలో భారత్ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే అక్కడ నివసిస్తున్న భారతీయ సమాజాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రాంతీయ శాంతి, భద్రతలను భారత్ ఎప్పుడూ కాంక్షిస్తుందని పునరుద్ఘాటించారు.