Site icon NTV Telugu

Tummala Nageswara Rao : ఆ పాపాన్ని ఈ 100 రోజుల ప్రభుత్వానికి రుద్దాలనుకోవడం మీ నీచమైన బుద్దికాక ఇంకేమనుకోవాలి?

Tummala Nageshwer Rao

Tummala Nageshwer Rao

ప్రకృతి వైపరీత్యాలని, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలనీ ప్రయత్నించే నీచమైన ప్రవృత్తి గల ప్రతిపక్ష నాయకులారా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అందులో.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 7, 2023. అంటే వర్షాకాలం అయిపోయిన తరువాత. అప్పటికే నాగార్జునసాగర్ లో నీళ్లు లేని కారణంగా మొదటిపంటకే నీళ్ళివనీ మీరు, రెండో పంటకి నీళ్ళివాలని హేతుబద్దత లేని డిమాండులు చేయడం మీ దుర్భుద్దికి తార్కారం కాదా? ఆ పాపాన్ని ఈ 100 రోజుల ప్రభుత్వానికి రుద్దాలనుకోవడం మీ నీచమైన బుద్దికాక ఇంకేమనుకోవాలి? – అనుమతులు లేకుండా, అధికారులు చెప్తున్న వినకుండా, ప్రక్క రాష్ట్రాలు నీటిని తరలిస్తున్నా, కళ్లు మూసుకొని , రిజర్వాయర్లు ఖాళీ చేసిన ప్రబుద్ధులు మీరు కారా.? నీటి నిర్వహణ మీద కనీస ధృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం ప్రక్క రాష్ట్రాలని అభ్యర్థించవల్సిన అధోగతికి ఈ రాష్ట్రానికి తీసుకువచ్చింది మీరు కాదా? రైతుబంధు పథకాన్ని మే మాసం వరకు ఇచ్చిన ఘనత సొంతం చేసుకున్న ప్రభుత్వం మీది కాదా? అని ప్రశ్నించారు.

అంతేకాకుండా..’కేవలం రైతుబంధు పేరు మీద మిగతా పథకాలన్ని అనగా విత్తన సబ్సిడీ, ఇన్ ఫుట్ సబ్సిడీ, యాంత్రికరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్ల మీద సబ్సిడీలన్ని ఎత్తివేసి చిన్న, సన్నకారు రైతులకు కోలుకోనీయలేని దెబ్బతీసింది మీరు కాదా? గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన రైతులకు 1000 కోట్లు ఇస్తామని చెప్పి 1000 పైసలైన ఇచ్చారా? గత తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఏనాడైన ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయిన ఏ ఒక్క రైతునైనా ఆదుకున్నారా? కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన 10000 రూపాయలు ఐనా నష్టపోయిన రైతులందరికి ఇచ్చారా?.. కేవలం మెదటి విడతగా 150 కోట్లు మంజూరు చేసి, రెండో విడతగా ఎప్రిల్ మాసంలో కురిసిన వడగళ్ళ వానలకు నష్టపోయిన రైతులకు జీవో నెం. 24, 21.09.2023 304 కోట్లకు GO రిలీజ్ ఇచ్చి.. డబ్బులు విడుదల చేశారా? మే మాసంలో సంబంవించిన పంట నష్టాన్ని కనీసం సర్వే చేయించారా? ఈ విధంగా రైతులను అధోగతి పాలు చేసి, ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పరామర్శకు వెళుతున్నారు. మీరు పలికే మాయ మాటలు నమ్మడానికి ఇప్పుడు ఏ తెలంగాణ రైతు సిద్ధంగా లేరు.. పంటల భీమా పథకాన్ని ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా? కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్రీయ కృషీ వికాస్ యోజన, సాయిల్ హెల్త్ మేనేజ్ మెంట్, జాతీయ ఉద్యాన పథకం ఇలా ఒకటేంటి అన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా , ఏ ఒక్క పథకం అమలు చేయకుండా రైతుల ఉసురు పోసుకుంది మీరు కాదా? వ్యవసాయరంగమే కాదు, అన్ని వ్యవస్థలను కుప్పకూల్చి, అవినీతిమయం చేసిన ఘనత మీది కాదా? ధాన్యం కోనుగోలులో బ్యాంకు గ్యారంటీలు విచ్చలవిడిగా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 50,000 కోట్లు అప్పులు మిగిల్చిన మీరు, ఆ కోనుగోలును ఏనాడైనా సక్రమంగా నిర్వర్తించారా? ఉచిత విద్యుత్ పేరు మీద, అధిక ధరకు విద్యుత్ కోనుగోలు చేసి, తక్కువ ధరకు కొనే అవకాశమున్నా, వేల కోట్ల విద్యుచ్ఛక్తి భారం రాష్ట్ర రైతుల మీద వేసి, మీరు కోరుకొన్న కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చిన మాట వాస్తవం కాదా? రైతులకు నీళ్లీస్తామని చెప్పుకుంటూ, నిపుణుల మరియు సహచరుల సూచనలు పెడచేవిన పెట్టి మూర్ఖంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది మీరు కాదా? మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణం ఎవరిది?
ప్రాజెక్టుల నిర్మాణమని చెప్పి పంపులకు, మోటార్లకు వేల కోట్లు కంపెనీలకు దోచిపెట్టి, కమీషన్లు దండుకొని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది మీరు కాదా? కనీసం నాణ్యతా ప్రమాణాలు లేకుండా, ఇంత అసంబద్దమైన ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి , ఇన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేసి, మన తెలంగాణ సమాజం మీద భారం మోపింది మీరు కాదా?విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు, సాగునీటి రంగ ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టి, కమీషన్ల కక్కుర్తితో వాటిని రాష్ట్రానికి గుదిబండగా మార్చింది మీరు కాదా?’ అని ఆయన అన్నారు.

మీరు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో గోల్ మాల్

• ధాన్యం కొనుగోలులో గోల్ మాల్
• ధరణిలో భూముల గోల్ మాల్
• వాటిని తిరిగి అమ్మడంలో గోల్ మాల్
• విద్యుచ్ఛక్తి కొనుగోలు గోల్ మాల్
• అప్పులు చేయడంలో గోల్ మాల్
• గొర్రెల పథకంలో గోల్ మాల్
• చేప పిల్లల పంపిణీ పథకంలో గోల్ మాల్
• దళితబంధు పథకంలో గోల్ మాల్
• చివరికి రోగులకు ఇచ్చే CMRF పథకంలో గోల్ మాల్ అంటే మీకు సిగ్గుగా అనిపించట్లేదా?

మీరు చేసే ప్రతి కార్యక్రమంలో అవినీతి, మీ కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు, ఆఖరికి నికృష్టమైన ఫోన్ ట్యాపింగ్ కు కూడా బరితెగించి కుటుంబసభ్యులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం లేకుండా చేసిన మీరు, పాలన వ్యవస్థలో ఇన్ని అరిష్టాలకు, అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిన మీరు.. ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు..?వర్షాభావ పరిస్థితులను కూడా రాజకీయం చేయాలనుకొనే హేయమైన పనులకు పాల్పడుతూ మీ వ్యక్తిత్వాన్ని హననం చేసుకొనే పరిస్థితులు తెచ్చుకుంటున్నది మీరు కాదా..?ఎంత నికృష్టుడైనా వర్షాభావ పరిస్థితులని, కరువు పరిస్థితులని రాజకీయం కోసం వాడుకొంటారా? గత ప్రభుత్వం మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. పంటలభీమా పథకాన్ని పునరుద్ధరించి దాదాపు 2500 కోట్ల వరకు రైతుల ప్రీమియం కూడా ఈ ప్రభుత్వమే భరించి భవిష్యత్తులో ఏ ఒక్క రైతుకూడా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోకూడదని ధృడ సంకల్పం తీసుకున్నది. మీరు చేసిన నిర్వాకాలన్నిటీని ఇప్పటి ప్రభుత్వం మీద నెట్టివేసే రోజులు చెల్లినాయి. అటువంటి విషప్రయోగాలు ఈ తెలంగాణ ప్రజలు హర్షించరు. తెలంగాణ ప్రజలలో అంతో ఇంతో మిగిలిన మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దని మిత్రుడిగా నేను మీకిచ్చే సలహా.’ అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version