TTD Employees Retirement: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం (జులై 31) ఒక్కరోజే టీటీడీలో 37 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఇప్పటికే పలు కీలక విభాగాల్లో ఉన్న సిబ్బంది కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. టీటీడీలో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీపై అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో.. అనేక విభాగాలు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే కొనసాగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుండటం వల్ల పరిపాలనా వ్యవస్థపై అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా టీటీడీలో అత్యంత కీలకమైన ఆప్రైజర్ (నగల విలువ నిర్ధారణ అధికారులు) విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ఒకేసారి 11 మంది ఆప్రైజర్లు పదవీ విరమణ చేయడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో విధుల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు, ఈరోజు పదవీ విరమణ పొందుతున్న ఓ ఆప్రైజర్ను తాత్కాలికంగా కొనసాగించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ పరిధిలోని 63 ఆలయాల్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాల తనిఖీ, విలువ నిర్ధారణ, భద్రతా ప్రక్రియల్లో ఆప్రైజర్ల పాత్ర అత్యంత కీలకమైనది. ఈ నేపథ్యంలో ఆ విభాగంలో అనుభవజ్ఞులైన సిబ్బంది కొరత ఏర్పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. శాశ్వత ఉద్యోగుల నియామకాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించి.. ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

