Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరగింది. శ్రీవారి సర్వదర్శనానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వెళ్లిన వారికి దర్శనం చేసుకునేందుకు టైం పడుతుందని టీటీడీ తెలిపింది. వీకెండ్, వేసవి సెలవులు రావడంతో స్వామిని దర్శించుకునే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు, సర్వదర్శనం భక్తుల క్యూ లైన్ లతో మొత్తం నిండిపోయాయి. దాదాపు కిలోమీటర్ మేర కొండపై భక్తుల క్యూ లైన్లు ఉంది.. ఏకంగా రింగురోడ్డు శిలాతోరణం సర్కిల్ దాకా వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది.
Read Also: Stock Market: ఐదు రోజుల తర్వాత లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
కాగా, కలియుగ దైవం వేంకటేశ్వరుడి సన్నిధిలో భక్తుల రద్దీ రోజు రోజుకు పెరిగిపోతుంది. నిన్న స్వామివారిని 64, 115 మంది భక్తులు దర్శించుకోగా.. 32, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ. 4. 23 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. కంపార్ట్మెంట్లన్నీ నిండి బాట గంగమ్మ ఆలయం వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండిపోయారు. కాగా, 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అయితే, ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ తిరుమలకు వచ్చే భక్తులకు వసతి గృహాలు దొరకక పోవడంతో ఇబ్బందిగా మారింది. ఇక, క్యూలైన్లలో దర్శనం కోసం వేచి చూస్తున్న వారికి ఆహారం, తాగునీరు, పాలను టీటీడీ సిబ్బంది అందిస్తున్నారు.