TS Weather : ఓ వైపు ఎండలు మండుతున్నాయి.. అదే క్రమంలో వాతావరణం చల్లగా మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు మూడు రోజులుగా ఇదే పరిస్థితి రాష్ట్రంలో తలెత్తింది. దీంతో జనాలు ఎప్పుడు వాన పడుతుందో.. ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియక అయోమయంలో ఉన్నారు. రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.
Read Also:Gaddar : ధరణి పేరుతో పెద్ద కుట్ర జరుగుతోంది : గద్దర్
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం చాలా చోట్ల పొడి వాతావరణం ఉండే సూచనలు ఉన్నాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించింది. బుధవారం నుంచి శనివారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సోమవారం వికారాబాద్, హైదరాబాద్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం పడింది.
Read Also:Jupally Krishna Rao : నాగర్ కర్నూల్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్