అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి జారీ చేసిన హెచ్చరికలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్లో కొత్తగా ఏర్పడిన అధికార యంత్రాంగంతో సైనిక కార్యకలాపాలను ముగించే విషయమై అమెరికా కీలక చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు. ఈ చర్చలు సానుకూల ధోరణిలో సాగుతున్నాయని చెబుతూనే.. ఒకవేళ తక్కువ సమయంలోనే సరైన ఒప్పందం కుదరకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ని తక్షణమే వాణిజ్య కార్యకలాపాల కోసం పూర్తిగా తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఒకవేళ ఈ నిబంధనలకు ఇరాన్ లొంగకపోతే.. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి ఆ దేశ ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతుందని హెచ్చరించారు. ఇరాన్ అంతటా విస్తరించి ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ప్రధాన చమురు బావులు, వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ‘ఖార్గ్ ద్వీపాన్ని’ పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరించారు. అవసరమైతే సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను కూడా ధ్వంసం చేయడానికి వెనుకాడబోమని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికా ఈ ప్రాంతాలను ముట్టుకోలేదని, కానీ సహనం నశిస్తే ఇవి తమ తదుపరి లక్ష్యాలు అవుతాయని ఆయన ఘాటుగా స్పందించారు.
Also Read:Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?
గత 47 ఏళ్లుగా ఇరాన్ పాత ప్రభుత్వం సాగించిన ‘హింసా పాలన’ లో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికులకు, ఇతర పౌరులకు ఇది ప్రతీకారమని ట్రంప్ అభివర్ణించారు. ఈ హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యల ప్రభావం అంతర్జాతీయంగా చమురు ధరలపై , ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడే అవకాశం ఉంది. భారత్ వంటి దేశాలు తమ చమురు దిగుమతుల కోసం ఈ ప్రాంతంపైనే ఆధారపడటంతో, అక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై కూడా ఒత్తిడి పెంచుతాయి. చర్చల ద్వారా శాంతి నెలకొంటుందా లేక ట్రంప్ అన్నట్లుగా భారీ వినాశనం సంభవిస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతోంది.